ప్రపంచ క్రికెట్లో బెస్ట్ ప్లేయర్లలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఒకడు. అలాగే సౌతాఫ్రికా మాజీ లెజెండ్ ఏబీ డివిలియర్స్ కూడా సూపర్ ఆటగాడే. అయితే వీళ్లిద్దరిలో బెస్ట్ ఎవరు? ఈ ప్రశ్న ఎవరిని అడగాలి? ఇద్దరితో కలిసి ఎన్నో కీలక భాగస్వామ్యాలు ఏర్పరచి, తమ జట్టుకు ఎన్నో విజయాలు అందించిన వాళ్లనే అడగాలి కదా. జియో సినిమాలో జరిగిన ఒక కార్యక్రమంలో అదే జరిగింది.
ఆర్సీబీ మాజీ ప్లేయర్, లెజెండరీ క్రికెటర్ క్రిస్ గేల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అతనికి ఈ ప్రశ్న ఎదురైంది. 'కలిసి బ్యాటింగ్ చేసే విషయంలో డివిలియర్స్, కోహ్లీ.. వీళ్లిద్దరిలో ఎవరు బెస్ట్?' అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న విన్న గేల్ ఒకింత ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఆలోచనలో పడ్డాడు. చివరకు సౌతాఫ్రికా స్టార్ కన్నా కోహ్లీతో కలిసి ఆడటమే బెస్ట్ అని చెప్పేశాడు. తను ఈ సమాధానానికి ఎలా వచ్చింది కూడా గేల్ చెప్పాడు.

'ఇది చాలా చాలా కఠినమైన ప్రశ్న. అయితే నేను ఎక్కువగా విరాట్తో కలిసి బ్యాటింగ్ ఓపెనింగ్ చేశాను. కాబట్టి నేను విరాట్కే ఓటేస్తా' అని చెప్పేశాడు. 2011లో ఆర్సీబీతో చేరిన గేల్.. ఐపీఎల్లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. కోహ్లీ, గేల్, డివిలియర్స్ ముగ్గురూ కలిసి ఆ జట్టుకు ఎన్నో విజయాలు అందించారు. అయితే ఆ తర్వాత గేల్ క్రికెట్కు దూరమైన సంగతి తెలిసింది. ప్రస్తుతం అతను ఇలా కామెంటేటర్గా రాణిస్తున్నాడు. ఈ క్రమంలో ఒక సరదా విషయాన్ని కూడా గేల్ వెల్లడించాడు.
విరాట్తో కలిసి ఓపెనింగ్ చేసే సమయంలో కొంత ఒత్తిడి ఉండేదన్న గేల్.. 'ఆటలో అన్ని విషయాలు తనకు నచ్చినట్లే జరగాలని కోహ్లీ అనుకునేవాడు. నాతో కూడా చాలాసార్లు.. మొదటి బంతి నుంచే భారీ షాట్లు ఆడాలి కదా క్రిస్.. అనేవాడు. అప్పుడు నేను.. చూడు కుర్రాడా నేను 15 టీ20 సెంచరీలు చేశా. ఇక్కడ ఏం చేయాలో నాకు తెలుసు. సో.. నువ్వు కొంత ప్రశాంతంగా ఉండు అని చెప్పేవాడిని. కానీ కోహ్లీతో కలిసి ఆడటం మాత్రం చాలా సరదాగా ఉండేది' అని గుర్తుచేసుకున్నాడు.