ఐపీఎల్లో అతిపెద్ద మ్యాచ్కు రంగం సిద్ధమైంది. సదరన్ డెర్బీగా పిలుచుకునే చెన్నై, బెంగళూరు జట్లు మరోసారి తలపడనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, టీమిండియా మాజీ సారధి ఎంఎస్ ధోనీ.. చిన్నస్వామి స్టేడియంలో ఆడే చివరి మ్యాచ్ ఇదే అనే వార్తతో ఈ మ్యాచ్పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. మరి ఈ మ్యాచ్లో బద్దలవడానికి సిద్ధంగా ఉన్న రికార్డులు ఏవో చూద్దామా?
ధోనీ టాప్ స్కోర్: ఐపీఎల్లో ఆర్సీబీపై బ్యాటింగ్ చేసేందుకు బాగా ఇష్టపడే బ్యాటర్లలో ధోనీ ఒకడు. ఈ క్రమంలోనే ఆర్సబీపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రికార్డు సృష్టించేందుకు ఎంఎస్ ధోనీ రెడీగా ఉన్నాడు. ఇప్పటి వరకు ఆర్సీబీపై 31 ఇన్నింగ్సుల్లో బ్యాటింగ్ చేసిన ధోనీ 39.90 సగటు, 140 స్ట్రైక్ రేటుతో 838 పరుగులు చేశాడు.

అతను కనుక మరో రెండు పరుగులు చేసినా.. ఆర్సీబీపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. ఆర్సీబీపై వార్నర్ 839 పరుగులు చేశాడు.
చెన్నైపై కోహ్లీ ప్రభంజనం: ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. కోహ్లీ కూడా చెన్నైపై ఆడేందుకు తెగ ఇష్టపడతాడు. ఇప్పటి వరకు తన కెరీర్లో చెన్నైపై 29 ఇన్నింగ్సుల్లో కోహ్లీ బ్యాటింగ్ చేశాడు.
వీటిలో 39.16 సగటుతో ఏకంగా 979 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో కనుక కోహ్లీ 21 పరుగులు చేస్తే.. చెన్నైపై వెయ్యి పరుగులు చేసిన బ్యాటర్గా రికార్డు సృష్టిస్తాడు. ఇప్పటి వరకు శిఖర్ ధావన్ మాత్రమే చెన్నైపై వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాటర్.
రహానే కూడా లైన్లోనే..: ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్లలో అజింక్య రహానే ఒకడు. ప్రస్తుతం చెన్నై జట్టులో ఉన్న అతను కూడా బెంగళూరుతో జరిగే మ్యాచ్లో రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీగా ఉన్నాడు. ఇప్పటి వరకు 219 టీ20 ఇన్నింగ్సులు ఆడిన రహానే 5732 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 595 ఫోర్లు కూడా బాదాడు.
అంటే ఈ మ్యాచ్లో కనుక రహానే ఐదు ఫోర్లు కొడితే.. టీ20 ఫార్మాట్లో 600 ఫోర్లు బాదిన క్రికెటర్గా రికార్డు సృష్టిస్తాడు. అదే జరిగితే ఈ ఘనత సాధించిన ఎనిమిదో భారత బ్యాటర్గా నిలుస్తాడు. అంతేకాదు, ఈ 595 ఫోర్లలో 440 బౌండరీలు ఐపీఎల్లో కొట్టినవే. అంటే ఈ మ్యాచ్లో కనుక రహానే పది ఫోర్లు బాదితే.. ఐపీఎల్లో 450 ఫోర్లు బాదిన ఏడో భారతీయ బ్యాటర్గా కూడా రికార్డు సృష్టిస్తాడు