ఆర్సీబీ, సీఎస్కే మధ్య థ్రిల్లింగ్ ఫైట్కు అంతా రెడీ అయింది. అయితే చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ మ్యాచ్లో ఆడతాడా? అనేది అనుమానంగా మారింది. ఎందుకంటే ధోనీ కొన్ని రోజులుగా మోకాలి నొప్పితో బాధ పడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ చేతిలో చెన్నై ఓడిన తర్వాత మైదానం వీడే సమయంలో ధోనీ కుంటుకుంటూ నడవడం కూడా కొందరి కంట పడింది.
ఆ మ్యాచ్లో చెన్నైని ధోనీ గెలిపించినంత పని చేశాడు. అయితే చివరి ఓవర్లో సందీప్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో చెన్నైకి పరాజయం తప్పలేదు. ఈ మ్యాచ్ సీఎస్కే కెప్టెన్గా ధోనీకి 200వది కావడం గమనార్హం. ఈ మ్యాచ్లో కేవలం 17 బంతులు ఎదుర్కొన్న ధోనీ 32 పరుగులు చేశాడు. కానీ తమ జట్టుకు విజయం అందించలేకపోయాడు. ఈ క్రమంలోనే ధోనీ గాయం గురించి సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా స్పందించాడు.

ధోనీ గాయం ఇప్పటిది కాదని, కానీ అతను దాన్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ వస్తున్నాడని ఫ్లెమింగ్ చెప్పాడు. ధోనీ చాలా ప్రొఫెషనల్గా అని, గాయం బాధ పెడుతున్న దాన్ని మేనేజ్ చేస్తూ ఆడుతున్నాడని మెచ్చుకున్నాడు. ఇప్పుడు సీఎస్కే అసిస్టెంట్ కోచ్ మైక్ హస్సీ కూడా అదే మాట చెప్పాడు. 'ఈ గాయం చాలా కాలం నుంచి ధోనీని బాధ పెడుతోంది. తనకు సాధ్యమైనంతగా దాన్ని మేనేజ్ చూస్తూ వస్తున్నాడు ధోనీ. ప్రస్తుతానికి అతను బాగానే ఉన్నాడు' అని హస్సీ తెలిపాడు.
ఆర్సీబీ జట్టు చాలా బలంగా ఉందని, చివరి మ్యాచ్లో విజయంతో ఆ జట్టు జోరు మీదుందని హస్సీ అన్నాడు. చెన్నై, బెంగళూరు జట్లు తలపడిన ప్రతిసారీ మంచి థ్రిల్లింగ్ మ్యాచులు చూశామని చెప్పాడు. 'మా ప్లేయర్లు కూడా ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్లకు మంచి జట్టు ఉంది. బాగా ఆడుతున్నారు. చివరి విజయంతో ఆర్సీబీ కాన్ఫిడెన్స్ కూడా పెరిగి ఉంటుంది. కాబట్టి మేం గెలవాలంటే మా బెస్ట్ ఆట ఆడాలి' అని చెప్పుకొచ్చాడు.