ఐపీఎల్లో హైఓల్టేజ్ మ్యాచ్ అంటే బెంగళూరు వర్సెస్ ముంబై అని చెప్పాలి. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే.. ఫ్యాన్ వార్ ఓ రేంజ్లో ఉంటుంది. అలాంటి మ్యాచ్లో స్టార్ క్రికెటర్ల ఆట చూసేందుకు ప్రేక్షకులు కూడా ఎగబడతారు. అది కూడా ఆదివారం నాడు ఈ మ్యాచ్ జరుగుతుంటే ఎవరైనా ఊరికినే ఎందుకు ఉంటారు. మరి ఈ మ్యాచ్లో టాప్ స్కోరు చేసే బ్యాటర్లు ఎవరో ఒక లుక్కేస్తే..

ఫాఫ్ డుప్లెసిస్
ఆర్సీబీ కొత్త కెప్టెన్ డుప్లెసిస్ మంచి ఫామ్లో ఉన్నాడు. గతేడాది 16 మ్యాచుల్లో ఆర్సీబీ ఓపెనర్గా వచ్చిన అతను 468 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన సౌతాఫ్రికా టీ20 లీగ్లో కూడా అద్భుతంగా రాణించాడు. అంతకుముందు బిగ్ బ్యాష్ లీగ్లో కూడా అదరగొట్టాడు. ఇదే ఫామ్ను ఐపీఎల్లో కూడా కంటిన్యూ చేయాలని డుప్లెసిస్ భావిస్తున్నాడు. దానికితోడు ఈ మ్యాచ్ జరిగేది ఆర్సీబీ హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో కాబట్టి.. ఫ్యాన్స్ మద్దతు కూడా ఆ టీంకు ఉంటుంది. ఈ క్రమంలో డుప్లెసిస్ కనుక తన రిథమ్ అందుకుంటే ముంబై బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు.
సూర్యకుమార్ యాదవ్
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేల్లో వరుసగా మూడు గోల్డెన్ డక్లు నమోదు చేసిన సూర్యకుమార్ యాదవ్.. పొట్టి ఫార్మాట్లో ఎంత డేంజరస్ బ్యాటరో వేరే చెప్పక్కర్లేదు. ఈ సీజన్లో రాణించి తనకు వచ్చిన చెడ్డపేరు చెరిపేసుకోవాలని సూర్య ప్రయత్నిస్తాడు. దానికితోడు అతని ఆటతీరు కూడా ఈ ఫార్మాట్కు చక్కగా సరిపోతుంది. కాబట్టి ఈ మ్యాచ్లో సూర్య చెలరేగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చిన్న బౌండరీలు కాబట్టి సూర్య రెచ్చిపోతే ఆపడం కూడా ఆర్సీబీ బౌలర్లకు కష్టమే.
విరాట్ కోహ్లీ
గతేడాది ఆసియా కప్లో ఫామ్ అందుకున్న కోహ్లీ.. అప్పటి నుంచి వెనక్కు తిరిగి చూసుకోలేదు. వరుస పెట్టి మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేశాడు. తన బెస్ట్ ఫామ్ అందుకున్నట్లే కనిపించాడు. కానీ ఇంకా తను అనుకున్న రేంజ్లో ఆడటం లేదని, ఈ ఐపీఎల్ ఆ స్థాయి అందుకుంటానని కోహ్లీ చెప్పాడు. దీంతో అతనిపై అంచనాలు మరింతగా పెరిగాయి. కోహ్లీ కనుక అదే జోరు కొనసాగిస్తే అతన్ని ఆపడం ఏ బౌలర్కైనా కష్టమే. అలాంటిది బుమ్రా లేని ముంబై బౌలింగ్ యూనిట్ ఏం చేస్తుందనేది ప్రశ్న. కేవలం జోఫ్రా ఆర్చర్ను నమ్ముకొని బరిలో దిగితే వారికి కోహ్లీ చుక్కలు చూపించడం ఖాయం.