ముంబై ఇండియన్స్తో హైఓల్టేజ్ మ్యాచ్కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిందా టీం. ఆర్సీబీ కోచ్ సంజయ్ బంగర్ మాట్లాడుతూ.. ముంబైతో జరిగే మ్యాచ్కు ఆర్సీబీ స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ పూర్తి ఫిట్గా ఉన్నాడని ప్రకటించాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే స్నేహితుడి బర్త్ డే సెలబ్రేషన్స్లో మ్యాక్స్వెల్కు గాయమైన సంగతి తెలిసిందే. ఈ గాయం కారణంగా అతను ఆటకు కొంత కాలం దూరమయ్యాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన టెస్టు సిరస్కు కూడా మ్యాక్సీ దూరమయ్యాడు. ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్లో తొలి మ్యాచ్ ఆడినా కూడా గాయం తిరగబెట్టడంతో.. సిరీస్ డిసైడర్కు దూరమయ్యాడు. ఈ క్రమంలో అతను ఐపీఎల్లో ఆడటం కూడా అనుమానంగా మారింది. ముఖ్యంగా ఈ టోర్నీలో ఆర్సీబీ ఆడే ఆరంభ మ్యాచుల్లో మ్యాక్స్వెల్ ఆడటం కుదరదని ఫ్యాన్స్ భావించారు. ఈ ఏడాది ప్లేయర్ల గాయాల కారణంగా బాగా దెబ్బతిన్న జట్టు ఆర్సీబీనే కావడం గమనార్హం.

ఎన్నో అంచనాలతో మినీ వేలంలో ఆర్సీబీ కొనుగోలు చేసిన విల్ జాక్స్.. గాయంతో ఈ ఐపీఎల్కు దూరమయ్యాడు. అలాగే ఆ జట్టు ప్రధాన పేసర్ జోష్ హాజిల్వుడ్ కూడా గాయంతో ఆర్సీబీ ఆడే సగం మ్యాచుల్లో పాల్గొనడం లేదు. కీలక బ్యాటర్గా ఎదిగిన రజత్ పటీదార్ కూడా గాయం వల్ల ఆడటం లేదు. ఈ క్రమంలో మ్యాక్స్వెల్ కూడా ఆడకపోతే అది ఆర్సీబీకి గట్టి దెబ్బ అని ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు.
అయితే మ్యాక్స్వెల్ పూర్తి ఫిట్గా ఉన్నాడని, అతను ముంబైతో మ్యాచ్కు అందుబాటులో ఉంటాడని ఆర్సీబీ కోచ్ సంజయ్ బంగర్ తేల్చిచెప్పాడు. ఇటీవల ఆర్సీబీ స్క్వాడ్ ఆడిన ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా మ్యాక్సీ చెలరేగాడు. ఈ ఏడాది ఎలాగైనా కప్పు కొట్టాలని బరిలో దిగుతున్న ఆర్సీబీ.. సీజన్ను విజయంతో మొదలు పెట్టడం చాలా కీలకం. ఈ క్రమంలో మ్యాక్స్ వెల్ కూడా జట్టుతో చేరడం ఆర్సీబీ బలాన్ని పెంచుతుందని అనడంలో అతిశయోక్తి లేదు. అలాగే హాజిల్వుడ్ స్థానాన్ని రీస్ టాప్లేతో భర్తీ చేస్తున్నామని కూడా బంగర్ వెల్లడించాడు.