ఈ ఐపీఎల్లో తమ తొలి మ్యాచ్లోనే ముంబై ఇండియన్స్ వంటి బలమైన జట్టును రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఢీకొట్టింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అతను తమపై ఉంచిన నమ్మకాన్ని బౌలర్లు నిలబెట్టుకున్నారు. కీలక బ్యాటర్లు ఎవర్నీ క్రీజులో కుదురుకోనివ్వలేదు. దీంతో ముంబై జట్టు ఒకానొక సందర్భంలో కేవలం 48 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఇలాంటి సమయంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (84 నాటౌట్) చెలరేగాడు. ఆ జట్టు కుప్పకూలకుండా ఆదుకోవడమే కాకుండా.. ముంబైకి మంచి స్కోరు ఇచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. అతని పోరాటంతో ముంబై ఇండియన్స్ 171/7 స్కోరు సాధించింది. ఛేజింగ్లో ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఇద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. తమదైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. దీంతో 16.2 ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని ఆర్సీబీ ఛేదించేసింది.

ముఖ్యంగా డుప్లెసిస్ పవర్ప్లేలో కూడా చాలా వేగంగా ఆడాడు. ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగిన అతను 43 బంతుల్లో 73 పరుగులు చేశాడు. దీనిలో 5 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. దీంతో అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా మాట్లాడిన డుప్లెసిస్.. ఇలా సీజన్ ఆరంభించినందుకు సంతోషంగా ఉందన్నాడు. పవర్ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేసిన సిరాజ్ మ్యాచ్ టోన్ సెట్ చేశాడని మెచ్చుకున్నాడు.
అయితే డెత్ ఓవర్లలో తమ బౌలింగ్ మెరుగవ్వాల్సిన అవసరం ఉందని డుప్లెసిస్ ఒప్పుకున్నాడు. ఈ మ్యాచ్లో డెత్ ఓవర్లలో బౌలింగ్కు వచ్చిన సిరాజ్ ఏకంగా ఐదు వైడ్లు వేసిన సంగతి తెలిసిందే. 'చివరి 2-3 ఓవర్ల విషయంలో మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. ఇక ఛేజింగ్ ఇలాగే చెయ్యాలి కదా. బౌలింగ్లో పేస్ లేకపోతే ఆడటం కొంచెం కష్టంగా ఉంది. స్పిన్నర్లకు కూడా పిచ్ నుంచి సహకారం లభించింది. అయితే బ్యాటర్ సరైన పొజిషన్లో ఉంటే షాట్లు ఆడటం సులభమే' అని డుప్లెసిస్ వివరించాడు.
తొలిసారి హోం టీం కెప్టెన్గా చిన్నస్వామి స్టేడియంలో ఆడుతున్న అనుభవం అద్భుతంగా ఉందని అతను చెప్పాడు. 'ఇక్కడ హోం ప్లేయర్గా ఆడటం ఇదే నాకు తొలిసారి. ఇక ఎనర్జీ అంటారా.. విరాట్ కోహ్లీతో బ్యాటింగ్ చేస్తే ఆ ఎనర్జీ అలా వచ్చేస్తుంది. అతని మీద నుంచి అందరికీ అంటుకుంటుంది. ఈ విజయంతో ఆటగాళ్లందరిలో కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇలా సీజన్ మొదలు పెట్టడం మా జట్టుకు చాలా కీలకం' అని పేర్కొన్నాడు.