ఐపీఎల్-2024లో ప్లేఆఫ్స్ ఫైట్ ఉత్కంఠగా సాగుతోంది. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మినహా మిగిలిన ఎనిమిది జట్లు సాంకేతికంగా పోటీలో ఉన్నాయి. కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తదుపరి దశకు చేరుకోవడం దాదాపు ఖరారైంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్కు కూడా ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.
ఇక మిగిలిన ఒక్క బెర్త్ కోసమే పోటీ రసవత్తరంగా సాగుతోంది. దాని కోసం చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తీవ్రంగా పోటీపడుతున్నాయి. అయితే సీజన్ ఆరంభంలోనే ప్లేఆఫ్స్ ఆశలను వదిలేసిన ఆర్సీబీ అనూహ్యంగా తిరిగి పోటీలోకి వచ్చింది.

ఈ సీజన్ తొలి ఎనిమిది మ్యాచ్ల్లో బెంగళూరు కేవలం ఒక్క విజయమే సాధించింది. కానీ తర్వాతి నాలుగు మ్యాచ్ల్లో వరుసగా గెలిచి 10 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. కేవలం గెలవడమే కాదు, ప్రత్యర్థిని చిత్తుగా ఓడించి నెట్రన్రేటును మెరుగుపర్చుకుంది. ఢిల్లీ, లక్నో జట్ల కంటే ఆర్సీబీ నెట్ రన్ రేటే మెరుగ్గా ఉండటం గమనార్హం.
అయితే ఆర్సీబీ సాంకేతికంగా పోటీలో ఉన్నప్పటికీ ప్లేఆఫ్స్ చేరుకోవడం అంత సులువు కాదు. మిగిలిన రెండు మ్యాచ్ల్లో గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై బెంగళూరు భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఆర్సీబీ సొంతమైదానంలో తమ చివరి రెండు మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్ల్లో బెంగళూరు తప్పక విజయం సాధించాలి. కేవలం గెలిస్తే సరిపోదు, నెట్రన్రేటును గణనీయంగా మెరుగుపర్చుకోవాలి.
మరోవైపు సీఎస్కేను గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ ఓడించాలి.చెపాక్లో చెన్నైను రాజస్థాన్ ఓడించడం అంత ఈజీ కాదు. అలాగే లక్నో సూపర్ జెయింట్స్ను ముంబై ఇండియన్స్ను చిత్తు చేయాలి. వాంఖడే వేదికగా జరిగే ఈ మ్యాచ్లో లక్నోను ముంబై ఓడించడం అంత కష్టమేమి కాదు. ఇక ఆర్సీబీ ప్లేఆఫ్స్కు క్వాలిఫై కావాలంటే ఆఖరి కండిషన్.. గుజరాత్ టైటాన్స్కు కేకేఆర్ లేదా సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమి రుచి చూపించాలి. ఒకవేళ గుజరాత్ గెలిచినా ఆర్సీబీకి మరో అవకాశం ఉంటుంది. అయితే టైటాన్స్ స్వల్ప తేడాతో విజయం సాధించాలి. అప్పుడు బెంగళూరు టాప్-4లో నిలుస్తుంది.