RCB vs SRH: ఐపీఎల్ 2025లో సన్రైజర్స్ హైదరాబాద్తో లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పరాజయం పాలైంది. ఆర్సీబీ 42 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 232 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యఛేదనలో ఆర్సీబీ పేలవంగా బ్యాటింగ్ చేసింది. 15.3 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ స్కోరు 173/3గా ఉంది. చివరి 27 బంతుల్లో జట్టు గెలవడానికి 59 పరుగులు అవసరం. జితేష్ శర్మ, రజత్ పాటిదార్ క్రీజులో ఉన్నారు. టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా రావాల్సి ఉంది.
కేవలం 5 బంతుల్లోనే అంతా చేజారిపోయింది..
15.3 ఓవర్ల వరకు మ్యాచ్ హోరాహోరీగా సాగినట్లు అనిపించింది. కానీ సన్రైజర్స్ హైదరాబాద్ విజయం కేవలం 5 బంతుల్లోనే ఖాయమైంది. ఈ 5 బంతుల్లో హైదరాబాద్ ముగ్గురు ఆర్సీబీ బ్యాటర్లను ఔట్ చేసింది. 16వ ఓవర్ నాలుగో బంతికి రజత్ పాటిదార్ రనౌట్ అయ్యాడు. ఇషాన్ మలింగ వేసిన డైరెక్ట్ త్రోతో అతను పెవిలియన్ చేరాడు. అదే ఓవర్ చివరి బంతికి విధ్వంసక బ్యాటర్ రొమారియో షెపర్డ్ గోల్డెన్ డక్ అయ్యాడు. ఇషాన్ మలింగ బౌలింగ్ లో అతనికే క్యాచ్ ఇచ్చి రొమారియో షెపర్డ్ ఔట్ అయ్యాడు. 17వ ఓవర్ రెండో బంతికే కెప్టెన్ జితేష్ శర్మ ఔటయ్యాడు. జయదేవ్ ఉనద్కత్ తన వికెట్ తీశాడు.

ఇషాన్ కిషన్ సెంచరీ మిస్
ఇషాన్ కిషన్ 94 పరుగుల అజేయ ఇన్నింగ్స్, ఆ తర్వాత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ విధ్వంసకర బౌలింగ్తో సన్రైజర్స్ హైదరాబాద్ ఆర్సీబీని 42 పరుగుల తేడాతో ఓడించింది. 232 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన ఆర్సీబీ జట్టు మొత్తం 19.5 ఓవర్లలోనే ఒక బంతి మిగిలి ఉండగానే ఆలౌట్ అయింది. ఆర్సీబీకి గొప్ప ఆరంభం లభించినా ఓటమిని చవిచూశారు. ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ(43), ఫిల్ సాల్ట్(62) వేగంగా పరుగులు అందించారు. ఆ తర్వాత ఏ బ్యాటర్ కూడా గొప్పగా రాణించలేకపోయాడు. ఆర్సీబీ ఒక బంతి మిగిలి ఉండగానే 189 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.
ఎస్ఆర్హెచ్ తరఫున కెప్టెన్ పాట్ కమిన్స్ గరిష్టంగా 3 వికెట్లు పడగొట్టగా, ఇషాన్ మలింగ రెండు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు జయదేవ్ ఉనద్కట్, హర్షల్ పటేల్, హర్ష్ దుబే, నితీష్ కుమార్ రెడ్డి తలో వికెట్ తీసుకున్నారు. అంతకు ముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన ఇషాన్ కిషన్ 48 బంతుల్లో 94 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.