
దుబాయ్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ దేవదత్ పడిక్కల్ అంచనాలకు తగ్గట్టుగానే రాణించాడు. ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ సాధించి ఒక్కసారిగా స్టార్ అయ్యాడు. దుబాయ్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో 42 బంతుల్లో 8 ఫోర్లతో 56 పరుగులు చేశాడు. మరోవైపు స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ హాఫ్ సెంచరీ చేయడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి.. సన్రైజర్స్ ముందు 164 రన్స్ లక్ష్యాన్ని ఉంచింది. సన్రైజర్స్ బౌలర్లలో అభిషేక్ శర్మ, విజయ్ శంకర్, టీ నటరాజన్ తలో వికెట్ తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బెంగళూరుకు ఓపెనర్లు అదిరే ఆరంభం అందించారు. యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. సన్రైజర్స్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ బౌండరీల మోత మోగించాడు.మరో ఎండ్లో ఉన్న ఆరోన్ ఫించ్.. 20 ఏళ్ల క్రికెటర్కు చక్కని సహకారం అందించాడు. 8 ఓవర్ల వరకు ఫించ్ 18 బంతులను మాత్రమే ఎదుర్కొగా.. పడిక్కల్ 32 బంతులను ఆడాడు. దూకుడుగా ఆడుతూ 36 బంతుల్లోనే హాఫ్సెంచరీ చేశాడు. దీంతో ఐపీఎల్లో అరంగేట్రం మ్యాచ్లో అర్ధశతకం చేసి.. దిగ్గజాల సరసన చేరాడు.
పడిక్కల్, ఫించ్ తొలి వికెట్కు 90 పరుగులు జోడించాక వరుస బంతుల్లో ఔటయ్యారు. విజయ్ శంకర్ వేసిన 11వ ఓవర్ చివరి బంతికి పడిక్కల్ (56; 42 బంతుల్లో 8x4) క్లీన్బౌల్డ్ కాగా.. తర్వాత 12వ ఓవర్ తొలి బంతికి అభిషేక్ శర్మ బౌలింగ్లో ఫించ్ (29; 27 బంతుల్లో 1x4, 2x6) ఎల్బీగా వెనుదిరిగాడు. అనంతరం విరాట్ కోహ్లీ (14), ఏబీ డివిలియర్స్ (51) కాసేపు వికెట్ కాపాడుకునేందుకు ప్రయత్నించారు. ఓపెనర్లు ఔటైన తర్వాత బెంగళూరు స్కోరు వేగం తగ్గింది. ఇక భారీ షాట్ ఆడబోయి విరాట్ ఔటయ్యాడు. బౌండరీ లైన్ వద్ద రషీద్ ఖాన్ చేతికి చిక్కాడు.
ఆపై శివమ్ దూబె (7) క్రీజులోకి రాగా.. డివిలియర్స్కే ఎక్కువగా స్ట్రైకింగ్ అవకాశం ఇచ్చాడు. దీంతో చివర్లో గేర్ మార్చిన ఏబీ.. ఫోర్లు, సిక్సర్లతో అలరించాడు. చివరి ఓవర్లో ఫోర్ కొట్టడంతో పాటు ఇంకో రెండు పరుగులు తీసి ఈ సీజన్లో తన తొలి అర్ధ శతకం నమోదు చేశాడు. ఆ వెంటనే మూడో బంతికి కూడా రెండో పరుగు తీయబోయి ఏబీ (51; 30 బంతుల్లో 4x4, 2x6) రనౌటయ్యాడు. చివరికి బెంగుళూరు 163/5తో సరిపెట్టుకుంది. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్, శంకర్, అభిషేక్ తలో వికెట్ తీశారు. ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ మ్యాచ్ మధ్యలోనే తప్పుకున్నాడు.