RCB vs RR: ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా 42వ మ్యాచ్ జరుగుతోంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచులో భాగంగా ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ కు దిగడంతో ఆర్సీబీ బ్యాటింగ్ చేసింది.
తొలి ఆటగాడిగా...
అయితే ఈ సీజన్ లో విరాట్ కోహ్లీ ఫుల్ ఫామ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచుల్లో 4 హాఫ్ సెంచరీలతో 322 పరుగులు చేశాడు. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచులోనూ అదిరే ప్రదర్శన చేశాడు. ఈ 9వ మ్యాచులో హాఫ్ సెంచరీ (Virat Kohli Half century) బాదాడు. 32 బంతుల్లో 51 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచులో 42 బంతుల్లో ఎదుర్కొన్న కోహ్లీ.. 8 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 70 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే కోహ్లీ చరిత్ర సృష్టించాడు. చిన్నస్వామి స్టేడియంలో 3500 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అలానే టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే వేదికపై 3500 పరుగులు చేసిన తొలి క్రికెటర్ గానూ ఘనత సాధించాడు.
జస్ట్ మిస్..
ఈ మ్యాచులో మూడు సిక్స్లు కొడితే కోహ్లీ మరో అదిరిపోయే రికార్డును ఖాతాలో వేసుకునేవాడు. మూడు సిక్స్లు బాది ఉంటే.. టీ20 క్రికెట్లో (ఛాంపియన్స్ లీగ్, ఐపీఎల్) 300 సిక్స్లు కొట్టిన తొలి ఆర్సీబీ బ్యాటర్గా నిలిచేవాడు. కానీ అతడు ఈ మ్యాచులో రెండు సిక్సులు మాత్రమే కొట్టాడు.
