
అబుదాబి: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. స్వల్ప స్కోరుకే రాజస్థాన్ మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. బెంగళూరు బౌలర్ల ధాటికి 31 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (5), ఓపెనర్ జోస్ బట్లర్ (22), యువ ఆటగాడు సంజూ శాంసన్ (4) వికెట్లను ఐదు ఓవర్లలోపే రాజస్థాన్ కోల్పోయింది. దీంతో ప్రస్తుతం స్మిత్ సేన వికెట్లు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది
పేసర్ ఇసురు ఉడానా వేసిన మూడో ఓవర్లో స్మిత్ (5) బౌల్డయ్యాడు. నవదీప్ సైనీ వేసిన నాలుగో ఓవర్లో దూకుడుగా ఆడుతున్న జోస్ బట్లర్ (22) దేవదత్ పడిక్కల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ వచ్చీ రావడంతోనే కీలక వికెట్ పడగొట్టాడు. చహల్ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికే హార్డ్హిట్టర్ సంజూ శాంసన్ (4) రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే ఈ క్యాచ్ను పట్టే క్రమంలో కాస్త సందిగ్థం నెలకొంది. చహల్ బంతిని గ్రౌండ్కు టచ్ చేశాడా.. అనే దానిపై థర్డ్ అంపైర్ నిర్ణయానికి వెళ్లారు ఫీల్డ్ అంపైర్లు.
పలు కోణాల్లో ఆ క్యాచ్ను పరిశీలించిన తర్వాత బంతి గ్రౌండ్కు టచ్ కాలేదని థర్డ్ అంపైర్ తేల్చాడు. బంతి క్రింద పడుతున్న సమయంలో చహల్ వేళ్లు ఉన్నాయని తేల్చిన థర్డ్ అంపైర్.. అది ఔట్గా ప్రకటించాడు. కానీ బంతి గ్రౌండ్కు తగిలినట్లు కొన్ని కోణాలు స్పష్టంగా కనబడింది. ఇది ఔటా అంటూ రాజస్తాన్ రాయల్స్ అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు. శాంసన్ నిజంగానే ఔట్ అయ్యాడా? అని ప్రశ్నిస్తున్నారు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది బ్యాట్స్మన్కు ఫేవర్గా ఉండాలి కానీ ఇలా ఎలా ఇస్తారంటూ మండిపడుతున్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ ఆదిలోనే వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. రాజస్థాన్ పుంజుకునేందుకు బెంగళూరు బౌలర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. మిడిలార్డర్లో రాబిన్ ఉతప్ప (17) ఈ మ్యాచ్లోనూ విఫలమయ్యాడు. సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న మహిపాల్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 29 బంతుల్లో 30 పరుగులు చేశాడు. అతనికి పరాగ్ అండగా ఉన్నాడు.14 ఓవర్లకు రాజస్థాన్ 4 వికెట్లకు 89 పరుగులు చేసింది. మహిపాల్ (30), పరాగ్ (11) క్రీజులో ఉన్నారు.