RCB vs PBKS: ఐపీఎల్ 2025లో వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై పంజాబ్ కింగ్స్ మ్యాచు ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. 96 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 12.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 98 పరుగులు చేసింది. పంజాబ్ విజయంలో నెహాల్ వధేరా (33 నాటౌట్) ఆఖర్లో మెరుపులు మెరిపించి కీలకంగా వ్యవహరించాడు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హెజిల్ వుడ్ 3 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు తీశాడు. కాగా, ఆర్సీబీకి ఇది మూడో ఓటమి. పంజాబ్ కు ఇది ఐదో విజయం.
లక్ష్య ఛేదనలో మొదటగా.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో 2.4 ఓవర్ వద్ద భారీ షాట్ కు యత్నించి టిమ్ డేవిడ్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు ప్రభసిమ్రాన్ సింగ్ (9 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 13 పరుగులు). దీంతో 22 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది పంజాబ్ కింగ్స్. ఆ తర్వాత జోష్ హేజిల్ వుడ్ బౌలింగ్ లో 3.4 ఓవర్ దగ్గర టిమ్ డేవిడ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు ప్ప్రియాంశ్ ఆర్య (11 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ సాయంతో 16 పరుగులు). దీంతో 10 బంతుల తేడాలోనే.. 32 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది పంజాబ్ కింగ్స్.

ఒకే ఓవర్ లో రెండు వికెట్లు..
ఆ తర్వాత మళ్లీ జోస్ హేజిల్ వుడ్ ఏడో ఓవర్ లో ఒక్క బంతి వ్యవధిలో రెండు వికెట్లు తీసి అదరగొట్టాడు. 7.4 ఓవర్ దగ్గర అద్భుతమైన బంతికి శ్రేయస్ అయ్యర్ (7) వికెట్ కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 20 బంతుల తేడాతో 52 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ మూడో వికెట్ కోల్పోయింది. అనంతరం 7.6 ఓవర్ దగ్గర సుయాంశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి జోస్ ఇంగ్లిస్(14) వెనుదిరిగాడు. దీంతో 53 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్.
దంచికొట్టిన నేహాల్ వధేరా
ఐదో వికెట్ గా శశాంక్ సింగ్ (1).. భువనేశ్వర్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నేహాల్ వధేరా దంచి కొట్టాడు. 19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 33 పరుగులు సాధించాడు. తన జట్టుకు విజయాన్ని అందించాడు.
ఆపద్బాంధవుడు టిమ్ డేవిడ్..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ.. పంజాబ్ బౌలర్లు ఓ ఆట ఆడుకున్నారు. దీంతో బెంగళూరు జట్టు.. నిర్ణీత 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. ఆఖర్లో టిమ్ డేవిడ్ (26 బంతుల్లో 50*: 5 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ఈ మాత్రం స్కోరు చేసింది. కెప్టెన్ రజత్ పటీదార్ (23) ఫర్వాలేదనిపించాడు. మిగతావారు విఫలమయ్యారు. మొదటి ఓవర్ నాలుగో బంతికే అర్ష్దీప్ బౌలింగ్లో ఫిల్ సాల్ట్ (4) క్యాచ్ ఔటవ్వగా... మరో ఓపెనర్ కోహ్లీ (1) కూడా అర్ష్దీప్ బౌలింగ్లోనే పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే బార్ట్లెట్ బౌలింగ్లో లివింగ్ స్టోన్ (4) వెనుదిరిగాడు. ఆరో ఓవర్ ఆఖరి బంతికి జితేశ్ శర్మ (2), ఏడో ఓవర్ తొలి బంతికి కృనాల్ పాండ్య (1) పెవిలియన్ చేరాడు. దీంతో 7 ఓవర్లు పూర్తవ్వకముందే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో వెళ్లింది ఆర్సీబీ.
ఆ తర్వాతి ఓవర్లో కెప్టెన్ రజత్ పటీదార్ (23) చాహల్ బౌలింగ్లో ఔటయ్యాడు. 9వ ఓవర్లో భాండగే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన టిమ్ డేవిడ్ కాసేపు దూకుడుగా ఆడి అర్ధ శతకం బాదాడు. మరోవైపు 12వ ఓవర్లో హర్ప్రీత్ వరుస బంతుల్లో భువనేశ్వర్, యశ్ దయాల్ ఔట్ అయినా కూడా డేవిడ్ ముందుకు సాగాడు. ఈ క్రమంలోనే 13 ఓవర్లో రెండు ఫోర్లు, ఆఖరి ఓవర్లో చివరి మూడు బంతుల్లో మూడు సిక్స్లు బాది.. జట్టుకు కాస్త ఊరటకలిగించాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 2, యాన్సెన్ 2, చాహల్ 2, హర్ప్రీత్ బ్రార్ 2, బార్ట్లెట్ ఒక వికెట్ దక్కించుకున్నారు.