RCB vs PBKS: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1ని గెలుచుకోవడం ద్వారా ఆర్సీబీ ఫైనల్కు తమ టికెట్ను నిర్ధారించుకుంది. ఆర్సీబీ క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్ను భారీ తేడాతో ఓడించింది. అయితే పంజాబ్ ఫైనల్కు చేరుకోవడానికి ఇంకా ఒక అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో పంజాబ్ బ్యాటింగ్ చాల పేలవంగా ఉంది. ఈ కీలక మ్యాచ్లో పంజాబ్ జట్టు కేవలం 101 పరుగులకే ఆలౌట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. పంజాబ్ తరఫున ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం కూడా ముషీర్ ఖాన్కు లభించింది. అదే సమయంలో ముషీర్ ఖాన్ బ్యాటింగ్ కోసం గార్డ్ తీసుకుంటున్నప్పుడు.. స్లిప్లో ఫీల్దింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ అతడిని అవమానించాడని ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విరాట్ ముషీర్ను అవమానించాడా?
ముషీర్ ఖాన్కు ఈ సీజన్లో తొలిసారి ఆడే అవకాశం వచ్చింది. కానీ అతను దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్లో ముషీర్ ఖాన్ను ఇంపాక్ట్ ప్లేయర్గా చేర్చింది. కానీ అతను ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యాడు. అదే సమయంలో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. దీనిలో ముషీర్ బ్యాటింగ్కు గార్డ్ తీసుకుంటున్నప్పుడు కోహ్లీ అతని వైపు చూపిస్తూ ఏదో చెబుతున్నట్లు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో షేర్ చేయబడిన ఈ వీడియో క్యాప్షన్లో విరాట్ కోహ్లీ భారత ఆటగాడిని అవమానించాడని.. "ఆటగాడిని వాటర్ బాటిల్తో ఆడటానికి పంపారు"అని కోహ్లీ అన్నాడని ఓ యూజర్ రాసుకొచ్చాడు. అయితే అసలు విరాట్ కోహ్లీ ఏం అన్నాడనే విషయం ఎవరికీ తెలియదు. ఏం తెలియకుండానే నెట్టింట విరాట్ కోహ్లీ పంజాబ్ ఆటగాడిని అవమానించాడని రాసుకొస్తున్నారు.

9 ఏళ్ల తర్వాత ఫైనల్కు చేరిన ఆర్సీబీ
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు 101 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ తరఫున మార్కస్ స్టొయినీస్ అత్యధికంగా 26 పరుగులు సాధించగా.. 8 మంది బ్యాటర్లు రెండంకెల మార్కును కూడా చేరుకోలేకపోయారు. ఆర్సీబీ తరఫున బౌలర్లలో జోష్ హేజిల్వుడ్, సుయాష్ శర్మ తలో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆర్సీబీ 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఈ సులభమైన లక్ష్యాన్ని చేరుకుంది. ఆర్సీబీ తరఫున ఫిల్ సాల్ట్ అత్యధికంగా 56 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. దీనితో పాటు మయాంక్ అగర్వాల్ 19 పరుగులు, రజత్ పాటిదార్ 15 పరుగులు, విరాట్ కోహ్లీ 12 పరుగులు చేశారు.