
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో జూనియర్ డివిల్లియర్స్గా పేరున్న ముంబై ఇండియన్స్ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ సరికొత్త రికార్డు సృష్టించాడు. కెరీర్ పరంగా ఐపీఎల్లో వేసిన తొలి బంతికే వికెట్ తీసిన తొలి బౌలర్గా ఘనత సాధించాడు. అది కూడా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ వికెట్ కావడం గమనార్హం. ఈ క్రమంలో ఐపీఎల్లో వేసిన తొలి బంతికే వికెట్ తీసిన మొదటి బౌలర్గా డెవాల్డ్ బ్రెవిస్ నిలిచిపోయాడు. ప్రస్తుతం డెవాల్డ్ బ్రెవిస్పై ప్రశంసలు కురుస్తున్నాయి.
కాగా శనివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో భాగంగా జరిగిన మ్యాచ్లో డెవాల్డ్ బ్రెవిస్ ఈ రికార్డు సృష్టించాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ను ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అనూహ్యంగా అప్పటివరకు ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయని డెవాల్డ్ బ్రెవిస్ చేతికి ఇచ్చాడు. రోహిత్ శర్మ నమ్మకాన్ని నిలబెట్టుకున్న డెవాల్డ్ బ్రెవిస్ తొలి బంతికే విరాట్ కోహ్లీని ఎల్బీడబ్ల్యూలో ఔట్ చేశాడు.
ఆ విషయమై విరాట్ కోహ్లీ రివ్యూకు వెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో కోహ్లీ 48 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో డెవాల్డ్ బ్రెవిస్ 8 పరుగులకే ఔట్ అయ్యాడు.
ఇక ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై 7 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 6 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఒకానొక దశలో 79 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన్పటికి సూర్యకుమార్ యాదవ్ ఆదుకున్నాడు. అతను 68 పరుగులతో అజేయంగా నిలిచాడు.
మిగతా బ్యాటర్లలో రోహిత్ శర్మ 26, ఇషాన్ కిషన్ 26, జయదేవ్ ఉనద్కత్ 13*, డెవాల్డ్ బ్రెవిస్ 8, రమన్ దీప్ సింగ్ 6 పరుగులు చేయగా.. తిలక్ వర్మ, పొలార్డ్ డకౌట్ అయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో హసరంగ, హర్షల్ పటేల్ రెండేసి, ఆకాష్ దీప్ వికెట్ తీశారు. అనంతరం లక్ష్యాన్ని ఆర్సీబీ 3 వికెట్లు కోల్పోయి చేధించింది. ఆర్సీబీ బ్యాటర్లలో అనుజ్ రావత్ 66, విరాట్ కోహ్లీ 48, ఫాఫ్ డుప్లిసెస్ 16, మాక్స్వెల్ 8*, దినేష్ కార్తీక్ 7* పరుగులు చేశారు.