
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్ (ఎంఐ)తో జరుగుతున్న మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) భారీ స్కోర్ చేసింది. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. దాంతో ముంబై ముందు 166 పరుగుల పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచులో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ బాదాడు. 42 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సులతో 51 రన్స్ చేశాడు. కోహ్లీకి తోడు హిట్టర్ గ్లెన్ మ్యాక్స్వెల్ (56; 37 బంతుల్లో 6x4, 3x6) కూడా సూపర్ ఫిఫ్టీతో చెలరేగాడు. వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ (32; 24 బంతుల్లో 2x4, 2x6) రాణించాడు. ముంబై పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బెంగళూరుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. జస్ప్రీత్ బుమ్రా వేసిన రెండో ఓవర్లో ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (0) వికెట్ని కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రీకర్ భరత్ ఫర్వాలేదనింపించాడు. బుమ్రా వేసిన నాలుగో ఓవర్లో విరాట్ కోహ్లీ ఓ సిక్స్, ఫోర్ బాదగా.. శ్రీకర్ బౌండరీ కొట్టాడు. దీంతో ఆ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. అనంతరం ఆడమ్ మిల్నే వేసిన ఓవర్లో కోహ్లీ మరో సిక్స్, ఫోర్ బాదాడు. ప్రమాదకరంగా మారుతున్న శ్రీకర్ని 9వ ఓవర్లో రాహుల్ చహర్ పెవిలియన్కి పంపించాడు. ఆపై బౌల్ట్ వేసిన 15వ ఓవర్లో కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి.
విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ బాదాడు. తర్వాతి మిల్నే వేసిన ఓవర్లో విరాట్ ఔటైన తర్వాత మ్యాక్స్వెల్ జోరు పెంచాడు. మిల్నే వేసిన 18వ ఓవర్లో ఓ సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ బాదాడు. 19వ ఓవర్ వేసిన బుమ్రా.. మ్యాక్స్వెల్, ఏబీ డివిలియర్స్ (11) వరుస బంతుల్లో ఔట్ చేసి ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడు. బౌల్ట్ వేసిన చివరి ఓవర్లో షాబాబ్ అహ్మద్ (1) పెవిలియన్ చేరాడు. డాన్ క్రిస్టియాన్ (1), కైల్ జేమీసన్ (2) నాటౌట్గా నిలిచారు. ముంబై బౌలర్లలో బుమ్రా మూడు.. రాహుల్ చహర్, ఆడమ్ మిల్నే, బౌల్ట్ తలో వికెట్ తీశారు.
ఈ మ్యాచులో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో 10000 పరుగులు పూర్తిచేసిన తొలి భారత బ్యాటర్గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ముంబై పేసర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన మూడో ఓవర్ రెండో బంతికి బౌండరీ బాదడంతో కోహ్లీ టీ20ల్లో 10,000 పరుగులు పూర్తిచేశాడు. టీమిండియా (టీ20 మ్యాచులు), ఢిల్లీ (దేశీయ క్రికెట్), బెంగళూరు (ఐపీఎల్) జట్లకు ఆడుతూ కోహ్లీ పదివేల రన్స్ చేశాడు. టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ ఐదవ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మాజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు క్రిస్ గేల్ ముందున్నాడు. యూనివర్స్ బాస్ 446 మ్యాచ్లలో 22 సెంచరీలు మరియు 87 అర్ధ సెంచరీలతో 36.94 స్ట్రైక్ రేట్తో 14,261 పరుగులు చేశాడు.