
హైదరాబాద్: 'ఈ సాలా కప్ నమదే (ఈ సారి కప్ మాదే)'.. ఈ స్లోగన్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత 14 ఏళ్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులు దాన్ని (స్లోగన్) ఓ మంత్రంలా జపిస్తున్నారు. ఈ ఏడాది కోట్లాది మంది ఆర్సీబీ అభిమానుల ఆశ నెరవేరేలా కనిపించినా.. బెంగళూరు టైటిల్ వేటలో రెండు మెట్ల ముందు బోల్తా పడింది. దాంతో ట్రోఫీ సాధించి కెప్టెన్సీ నుంచి గర్వంగా తప్పుకుంటాడు అని భావించిన విరాట్ కోహ్లీ అభిమానులు నిరాశకు లోనయ్యారు. కేవలం ఫాన్స్ మాత్రమే కాదు.. ఆర్సీబీ ఆటగాళ్లు కూడా నిరాశ చెందారు. ముఖ్యంగా మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్. ఐపీఎల్ ట్రోఫీ గెలవనందుకు నన్ను క్షమించండని అభిమానులను కోరాడు.
యూఏఈలో రెండో అంచె ఆరంభానికి ముందు ఆర్సీబీ కెప్టెన్గా ఇదే తన చివరి సీజన్ అని విరాట్ కోహ్లీ ప్రకటించడంతో.. ఈసారి కప్పు గెలిచి తీరాల్సిందే అన్న భావన అభిమానుల్లో కలిగింది. అంతేకాదు కొందరు ఆర్సీబీ ప్లేయర్స్ కూడా కోహ్లీ కోసమైనా కప్ కొడతామని చెప్పారు. అందులో ఏబీ డివిలియర్స్ కూడా ఉన్నాడు. అయితే షార్జాలో సోమవారం రాత్రి జరిగిన ఎలిమినేటర్ మ్యాచులో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్).. ఆర్సీబీని 4 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. దాంతో ఆర్సీబీ ఐపీఎల్ 2021 నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ అయిన వెంటనే ఏబీ మైదానంలోనే ఏడ్చేశాడు. ఆపై ట్విట్టర్ వేదికగా అభిమానులను క్షమాపణలు కోరాడు. 'ఆర్సీబీ జట్టుకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ట్రోఫీని గెలవనందుకు నన్ను క్షమించండి' అని ఏబీ ట్వీట్ చేశాడు.
'విరాట్ కోహ్లీ గొప్ప ప్లేయర్. ఆర్సీబీ జట్టులో మరియు అంతర్జాతీయ స్థాయిలో నీ విజయం కోసం ఎదురుచూస్తున్నాను. జట్టు కోసం నువ్ చేసిన ప్రతిది బాగుంది. అందుకు నీకు ధన్యవాదాలు. కెప్టెన్గా కోహ్లీ అనగానే గొప్పతనం అనే మాట గుర్తొస్తుంది. అతడు కెప్టెన్గా జట్టును ముందుండి నడిపించిన తీరు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపింది. ఇది ట్రోఫీని సాధించిన దానికన్నా చాలా ఎక్కువ. కోహ్లీ గొప్పగా ప్రయత్నించాడు. ఇంకా ఈ ఆట ముగియలేదు. నువ్వు మాకోసం చేసిందేది మేం మర్చిపోం. ఈ జ్ఞాపకాలను ఇచ్చినందుకు ధన్యవాదాలు' అని ఏబీ డివిలియర్స్ మరో ట్వీట్ చేశాడు.
విరాట్ కోహ్లీ కెప్టెన్గా తప్పుకోవడంతో కొందరు అంపైర్లు ఇప్పుడు సంతోషంగా నిద్రపోతారని మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ నవ్వుతూ వ్యాఖ్యానించాడు. పలు మ్యాచ్ల్లో అంపైర్లతో కోహ్లీ ఘర్షణలను గుర్తుచేసుకుంటూ ఈ విధంగా మాట్లాడాడు. ఎలిమినేటర్ మ్యాచులో సునీల్ నరైన్ (4/21) అద్భుత బౌలింగ్ కారణంగా మొదట బెంగళూరు 7 వికెట్లకు 138 పరుగులకే పరిమితమైంది. విరాట్ కోహ్లీ (39; 33 బంతుల్లో 5×4) టాప్ స్కోరర్. శుభ్మన్ గిల్ (29; 18 బంతుల్లో 4×4), వెంకటేశ్ అయ్యర్ (26; 30 బంతుల్లో 1×6), సునీల్ నరైన్ (26; 15 బంతుల్లో 3×6) రాణించడంతో స్వల్ప లక్ష్యాన్ని కోల్కతా మరో రెండు బంతులు మిగిలి ఉండగా 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొహ్మద్ సిరాజ్ (2/19), హర్షల్ పటేల్ (2/19), యుజ్వేంద్ర చహల్ (2/16) జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా లాభం లేకుండాపోయింది.