రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ బలహీనంగా ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు తరుచూ విమర్శిస్తుంటారు. బ్యాటింగ్కు అనుకూలిస్తూ బౌండరీలు చిన్నవిగా ఉండే స్టేడియాల్లో మ్యాచ్ అంటే ఆర్సీబీ బౌలర్లకు కంటతడే అని జోకులు వేస్తుంటారు. కానీ చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు బౌలర్లు నిప్పులు చెరిగే బంతులు విసిరారు.
బెంగళూరు బౌలర్లు సమష్టిగా సత్తాచాటడంతో గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. షారుక్ ఖాన్ (37; 24 బంతుల్లో, 5x4, 1x6) టాప్ స్కోరర్. యశ్ దయాల్ (2/21), విజయ్ కుమార్ వైశాక్ (2/23), మహ్మద్ సిరాజ్ (2/29) తలో రెండు వికెట్లతో సత్తాచాటారు. టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన గుజరాత్ ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. పవర్ప్లేలో బంతికో పరుగు చేయడానికి కూడా గుజరాత్ బ్యాటర్లు చెమటోడ్చారు.

ఇన్నింగ్స్ ప్రారంభంలోనే గుజరాత్ను సిరాజ్ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (1; 7 బంతుల్లో), శుభ్మన్ గిల్ (2; 7 బంతుల్లో) వరుస ఓవర్ల ఔట్ చేశాడు. సిరాజ్కు తోడుగా ఆర్సీబీ ఇతర బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ పవర్ప్లేలో మూడు వికెట్లు కోల్పోయి 23 పరుగులే చేసింది. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ చెత్త రికార్డు నెలకొల్పింది. ఐపీఎల్ చరిత్రలో తమ అత్యల్ప పవర్ప్లే స్కోరును సాధించింది. ఈ సీజన్లో ఓ జట్టు చేసిన అత్యల్ప పవర్ప్లే స్కోరు కూడా ఇదే కావడం గమనార్హం.
పవర్ప్లే అనంతరం షారుక్ ఖాన్తో కలిసి డేవిడ్ మిల్లర్ (30; 20 బంతుల్లో, 3x4, 2x6) ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 37 బంతుల్లో 67 పరుగులు జోడించారు. అయితే ప్రమాదకరంగా మారుతున్న మిల్లర్ను కర్ణ్ శర్మ 12వ ఓవర్లో ఔట్ చేశాడు. కాసేపటికే విరాట్ కోహ్లి మెరుపు త్రోకి షారుక్ ఖాన్ రనౌటయ్యాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ 87 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. రాహుల్ తెవాతియా (35; 21 బంతుల్లో, 5x4, 2x6), రషీద్ ఖాన్ (18; 14 బంతుల్లో, 2x4, 1x6) పోరాడంతో గుజరాత్ మోస్తారు స్కోరు సాధించింది.