

ఐపీఎల్ సీజన్-12కు ముందు టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే సిరీస్ జరిగింది. ఈ సిరీస్ ఓ మ్యాచ్లో పుల్వామా ఉగ్రదాడి ఘటనకు నిరసనగా టీమిండియా ఆటగాళ్లు ఆర్మీ క్యాపులను ధరించి బరిలోకి దిగారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆకుపచ్చ రంగు జెర్సీతో బరిలోకి దిగింది.
ఆకుపచ్చ జెర్సీ ఎందుకంటే:
ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి మైదానం వేదికగా దిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టు ఆకుపచ్చ రంగు జెర్సీతో బరిలోకి దిగింది. వ్యర్థ పదార్థాల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు కొత్త జెర్సీతో బరిలోకి దిగాం అని బెంగళూరు తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది.
పర్యావరణంపై అవగాహన:
'తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయడంతో.. ఆ చెత్త మరలా వినిగోగించుకోవచ్చు. మన మైదానాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకుందాం' అని బెంగళూరు పోస్టు చేసింది. టాస్ వేసే ముందు ఇద్దరు కెప్టెన్లు శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీలు ఆకుపచ్చ రంగు జెర్సీపై సంతకం చేశారు. అనంతరం ఇద్దరూ రెండు మొక్కలను పట్టుకొని పర్యావరణంపై అవగాహన కల్పించారు.