
దినేష్ కార్తీక్(66*), గ్లెయిన్ మాక్స్వెల్(55) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 190 పరుగుల భారీ లక్ష్యాన్నిఉంచింది. ఒకానొక దశలో 92 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినప్పటికీ దినేష్ కార్తీక్, షాబాజ్ అహ్మద్(31*) అజేయంగా 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆర్సీబీకి 189 పరుగుల భారీ స్కోర్ అందించారు.
ఓపెనర్లు విఫలం
ఓపెనర్లు విఫలమవడంతో రాయల్ చాలెంజర్స్ 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పెయింది. అనుజ్ రావత్ను శార్దూల్ ఠాకూర్ డకౌట్ చేయగా.. ఫాఫ్ డుప్లిసెస్(8)ను ఖలీల్ అహ్మద్ ఫెమిలియన్ పంపాడు. ఈ క్రమలో ఆర్సీబీని విరాట్ కోహ్లీ, గ్లెయిన్ మాక్స్వెల్ ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే జట్టు స్కోర్ 40 పరుగుల వద్ద ఉండగా విరాట్ కోహ్లీ(12)ని లలిత్ యాదవ్ రనౌట్ చేశాడు.
మాక్స్వెల్ హాఫ్ సెంచరీ
ఒక వైపు వికెట్లు పడుతున్నప్పటికీ గ్లెయిన్ మాక్స్వెల్ మాత్రం చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో జట్టు స్కోర్ 75 పరుగుల వద్ద ఉండగా అక్షర్ పటేల్ వేపిన 10వ ఓవర్లో సుయాష్ ప్రభుదేసాయి (6) ఔటయ్యాడు. దీంతో 75 పరుగులకు ఆర్సీబీ 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత గ్లెయిన్ మాక్స్వెల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో మాక్స్వెల్కు ఇది 13వ హాఫ్ సెంచరీ. అయితే కుల్దీప్ యాదవ్ వేసిన 12వ ఓవర్లో లలిత్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి మాక్స్వెల్( 34 బంతుల్లో 55 రన్స్, 7 ఫోర్లు, 2 సిక్సులు) ఔటయ్యాడు. దీంతో 92 పరుగులకే ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయింది.