ఆ సింగిల్స్ తీసి ఉంటే:
ధోనీ చివరి ఓవర్లో అద్భుతంగా ఆడినా.. 19వ ఓవర్లో మూడు సార్లు సింగిల్ తీసే అవకాశం వచ్చినా ధోనీ మాత్రం క్రీజులోనే ఉండిపోయాడు. అయితే ఆ సింగిల్స్ తీసి ఉంటే మ్యాచ్ చెన్నై వైపు ఉండేదేమో అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అవతలి ఎండ్లో విధ్వంసక ఆటగాడు బ్రావో ఉన్నా కూడా ధోనీ సింగిల్స్ ఎందుకు తీయలేదని పలువురు విమర్శిస్తున్నారు.
సింగిల్స్ విషయంలో ప్రశ్నించం:
ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. 'ధోనీ ఏం చేసినా దానికి ఓ లెక్క ఉంటుంది. అవతలి ఎండ్లోని బ్రావో బౌండరీలు బాదగల సమర్థుడే. కానీ క్రీజులోకి వచ్చిరాగానే బౌండరీలు బాదడం ఏ బ్యాట్స్మెన్కు అయినా అసాధ్యమే. అందుకే ధోనీ సింగిల్స్ తీయలేదు. ఎన్నో ఉత్కంఠ మ్యాచులలో ధోనీ విజయాలు అందించాడు కాబట్టి సింగిల్స్ విషయంలో అతనిని మేం ప్రశ్నించం' అని ఫ్లెమింగ్ తెలిపారు.
భారీ షాట్లు ఆడాలని నిర్ణయించుకున్నా:
'రన్ రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాట్స్మెన్పై ఒత్తిడి సహజంగా ఉంటుంది. అప్పుడే క్రీజులోకి వచ్చిన బ్యాట్స్మన్ బౌండరీలు బాదడం అంత ఈజీ కాదు. బ్రావో కేవలం మూడు బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. అందుకే సింగిల్స్ తీయకుండా భారీ షాట్లు ఆడాలని నిర్ణయించుకున్నా' అని ధోనీ చెప్పుకొచ్చారు.