చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. 27 పరుగుల తేడాతో నెగ్గి ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. డుప్లెసిస్ (54; 39 బంతుల్లో, 3X4, 3X6), విరాట్ కోహ్లి (47; 29 బంతుల్లో, 3X4, 4X6), రజత్ పటిదార్ (41; 23 బంతుల్లో, 2X4, 4X6), కామెరూన్ గ్రీన్ (38*; 17 బంతుల్లో, 3X4, 3X6) సత్తాచాటారు.
అయితే ఆర్సీబీ ఇన్నింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే వరుణుడు అంతరాయం కలిగించాడు. ఆ తర్వాత పిచ్ స్పిన్కు గొప్పగా అనుకూలించింది. విపరీతమైన టర్న్తో సీఎస్కే స్పిన్నర్లు స్కోరును కట్టడిచేశారు. మిచెల్ శాంట్నర్ (1/23) పొదుపుగా బౌలింగ్ చేశాడు. అనంతరం ఛేదనలో చెన్నై 20 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది. రచిన్ రవీంద్ర (61; 37 బంతుల్లో, 5X4, 3X6) టాప్ స్కోరర్.

రవీంద్ర జడేజా (42; 22 బంతుల్లో, 3X4, 3X6), అజింక్య రహానె (33; 22 బంతుల్లో, 3X4, 1X6), ఎంఎస్ ధోనీ (25; 13 బంతుల్లో, 3X4, 1X6) పోరాడారు. అయితే ఆఖరివరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ప్లేఆఫ్స్కు క్వాలిఫై కావాలంటే సీఎస్కేకు చివరి ఆరు బంతుల్లో 17 పరుగులు అవసరం. యశ్ దయాల్ వేసిన తొలి బంతిని ధోనీ స్టేడియం బయటకు పంపించాడు. దీంతో ప్లేఆఫ్స్ సమీకరణం అయిదు బంతుల్లో 11 పరుగులుగా మారింది. కానీ యశ్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఆఖరి అయిదు బంతుల్లో ఒక్క పరుగే ఇచ్చాడు.
కాగా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ మాట్లాడాడు. ఈ అవార్డు యశ్ దయాల్కు దక్కాలని, అతను గొప్పగా బౌలింగ్ చేశాడని అన్నాడు. ''వాట్ ఏ మ్యాచ్. నమ్మశక్యంగా లేదు. సొంతమైదానంలో లీగ్ దశను విజయంతో ముగించడం ఎంతో ఆనందంగా ఉంది. మొదట మేం బ్యాటింగ్ చేసిన సమయంలో.. టీ20ల్లో నేను ఆడిన పిచ్లలో ఇదే అత్యంత కష్టతరమైన పిచ్గా అనిపించింది. వర్షం విరామం తర్వాత తిరిగొచ్చినప్పుడు 140-150 స్కోరు పిచ్లా మారింది. ఇది రాంచీలోని అయిదో రోజు టెస్టు మ్యాచ్ పిచ్లా ఉందని శాంట్నర్తో అన్నాను. కానీ ఇక్కడ 200+ స్కోరు సాధించడం గొప్ప విషయం''

''మేం 175 స్కోరుకు ప్రత్యర్థిని కట్టడి చేయాలనుకున్నాం. ఓ దశలో మా లక్ష్యానికి చాలా దగ్గర వచ్చాం. కానీ ధోనీ వచ్చాడు. అతను చాలా సార్లు జట్టును గెలిపించాడు. కానీ తడి బంతితో యశ్ దయాల్ వేసిన బౌలింగ్ విధానం అద్భుతం. తొలి బంతిని యార్కర్కు ప్రయత్నించగా అది ఫలించలేదు. ఆ తర్వాత యశ్ వేగాన్ని తగ్గించి బంతులు వేశాడు. అది గొప్పగా పనిచేసింది. ఈ పిచ్లో అదే ఉత్తమ ఎంపిక. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ యశ్కే దక్కాలి'' అని డుప్లెసిస్ అన్నాడు.