ఐపీఎల్ సీజన్-12లో బిగ్గెస్ట్ సిక్సర్ నమోదయింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ బిగ్గెస్ట్ సిక్సర్ ను బాదాడు. ఆదివారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో.. ధోనీ బంతిని స్టేడియం బయటికి పంపాడు.
లక్ష్య ఛేదనలో చెన్నై విజయానికి చివరి ఓవర్లో 26 పరుగులు అవసరం. బెంగళూరు పేసర్ ఉమేశ్ యాదవ్ వేసిన ఆ ఓవర్లో.. ధోనీ వరుసగా 4, 6, 6, 2, 6 బౌండరీలు బాది 24 పరుగులు చేసాడు. అయితే రెండో బంతికి ధోనీ కొట్టిన సిక్స్ ఏకంగా 111 మీటర్లు ప్రయాణించి స్టేడియం బయటకు దూసుకెళ్లింది. దురదృష్టవశాత్తు చివరి బంతికి అవతలి ఎండ్లో ఉన్న శార్ధుల్ ఠాకూర్ రనౌట్ కావడంతో చెన్నై ఓడిపోయింది. ఈ సిక్స్కు సంబందించిన వీడియోను ఓ అభిమాని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.
సీజన్-12లో ధోనీ 111 మీటర్ల సిక్స్ బాదడంతో.. ఇంతకుముందు ముంబయి ఇండియన్స్ ఆటగాడు హార్దిక్ పాండ్య కొట్టిన సిక్స్ ( 104 మీటర్లు) రెండవ స్థానంలోకి వెళ్ళింది. ఈ జాబితాలో కోల్కతా ఓపెనర్ క్రిస్లిన్ (102 మీటర్లు), పంజాబ్ ఓపెనర్ క్రిస్గేల్ (101 మీటర్లు), బెంగళూరు బౌలర్ ఉమేశ్ యాదవ్ (101 మీటర్లు)లు ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.