డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించలేకపోయింది. కీలక మ్యాచ్లో
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. డుప్లెసిస్ (54; 39 బంతుల్లో, 3X4, 3X6) టాప్ స్కోరర్.
విరాట్ కోహ్లి (47; 29 బంతుల్లో, 3X4, 4X6), రజత్ పటిదార్ (41; 23 బంతుల్లో, 2X4, 4X6), కామెరూన్ గ్రీన్ (38*; 17 బంతుల్లో, 3X4, 3X6) సత్తాచాటారు. మిచెల్ శాంట్నర్ (1/23) పొదుపుగా బౌలింగ్ చేశాడు. అయితే ఆర్సీబీ 219 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ, ప్లేఆఫ్స్ చేరాలంటే చెన్నై 200 పరుగులే చేయాలి. కాగా, ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఛేదనలో సీఎస్కే 20 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 191 పరుగులకు పరిమితమైంది.

రచిన్ రవీంద్ర (61; 37 బంతుల్లో, 5X4, 3X6), రవీంద్ర జడేజా (42; 22 బంతుల్లో, 3X4, 3X6), అజింక్య రహానె (33; 22 బంతుల్లో, 3X4, 1X6), ఎంఎస్ ధోనీ (25; 13 బంతుల్లో, 3X4, 1X6) పోరాడారు.ప్లేఆఫ్స్కు క్వాలిఫై కావాలంటే సీఎస్కేకు చివరి ఆరు బంతుల్లో 17 పరుగులు అవసరమయ్యాయి. యశ్ దయాల్ వేసిన తొలి బంతిని ధోనీ స్టేడియం బయటకు పంపించాడు. కానీ రెండో బంతికి భారీ షాట్కు యత్నించిన ధోనీ పెవిలియన్కు చేరాడు. చివరి నాలుగు బంతుల్లో చెన్నై ఒక్క పరుగే సాధించింది.
అయితే ఈ మ్యాచ్కు వ్యాఖ్యతగా పనిచేస్తున్న సీఎస్కే మాజీ క్రికెటర్ అంబటి రాయుడు లైవ్లోనే ఎమోషనల్ అయ్యాడు. ప్లేఆఫ్స్కు చెన్నై సూపర్ కింగ్స్ అర్హత సాధించకపోవడంతో బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. గత సీజన్ ముగిసిన అనంతరం రాయుడు ఐపీఎల్కు గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. ఐపీఎల్-2023లో సీఎస్కే విజేతగా నిలవడంతో రాయుడు కీలక పాత్ర పోషించాడు.