RCB Victory Parade: ఒక జట్టు సంవత్సరాలుగా ఒక ట్రోఫీ కోసం పరితపిస్తోంది. ప్రతిసారీ "ఈ సాలా కప్ నమ్దే'అంటూ అభిమానులు ట్రోల్స్ చేసేవారు. కానీ ఆ జట్టు ప్రతి ఓటమి తర్వాత కూడా ఆశను వదులుకోలేదు. ఎట్టకేలకు కలను సాకారం చేసుకుంది. 18వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఐపీఎల్ విజేతగా అవతరించింది. 18 సంవత్సరాల సుదీర్ఘం ప్రయాణం తర్వాత ఆర్సీబీ జట్టు చివరకు ఆ గొప్ప కలను నెరవేర్చుకుంది. మంగళవారం రాత్రి ఆర్సీబీ తన అసంపూర్ణ టైటిల్ విజయ గాథను సాకారం చేసుకుంది. మొదటి ఐపీఎల్ టైటిల్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్-18 ఫైనల్లో.. ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించి చరిత్రను తిరగరాసింది.
అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో తొలి ట్రోఫీని ముద్దాడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విక్టరీ పరేడ్లో పాల్గొననుంది. బెంగళూరులోని విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఆర్సీబీ విజయ యాత్రను చేపట్టనున్నారు. ఇవాళ(బుధవారం) మధ్యాహ్నం 3.30 గంటలకు ఆర్సీబీ విక్టరీ పరేడ్ ప్రారంభం కానుందని ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో ప్రకటించింది. మొదటి ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న తర్వాత ఆర్సీబీ తన అభిమానులతో విజయోత్సవాలను జరుపుకోవాలని భావిస్తోంది.

ఆర్సీబీ తొలి టైటిల్ సాధించడంతో ఆ జట్టు అభిమానులు, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ వేడుకలు జరుపుకుంటున్నారు. ఇంతవరకు ఐపీఎల్ టైటిల్ సాధించలేదని బాధ తొలగిపోవడంతో ఆర్సీబీ అభిమానులు ప్రతి చోటా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బాణాసంచా, డ్రమ్స్తో డ్యాన్సులు వేస్తున్నారు. బెంగళూరులో వేడుకలు అంబరాన్నంటాయి. ఆర్సీబీ గెలుపుపై సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఫన్నీమీమ్స్, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఫైనల్ మ్యాచ్ పరిస్థితి ఇలా..
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ ఫైనల్లో ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తొలుత ఆర్సీబీ బ్యాటింగ్ చేసింది. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. ఆర్సీబీ తరఫున విరాట్ కోహ్లీ 3 ఫోర్ల సాయంతో అత్యధికంగా 43 పరుగులు చేశాడు. పంజాబ్ తరఫున కైల్ జేమిసన్, అర్ష్దీప్ సింగ్ తలో 3 వికెట్లు పడగొట్టారు. 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. 6 పరుగుల తేడాతో మ్యాచ్ను కోల్పోయింది. పంజాబ్ తరఫున శశాంక్ సింగ్ అత్యధికంగా 61 పరుగులు చేశాడు. ఆర్సీబీ తరఫున భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యా తలో 2 వికెట్లు పడగొట్టారు.