IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మే 17 నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. మే 9న భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల కారణంగా సీజన్-18 ఒక వారం పాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే. మే 17న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అదే సమయంలో ఆర్సీబీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్లలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఆడడంపై ఇప్పుడు సందేహం నెలకొంది. సీఎస్కేతో ఆడిన మ్యాచ్లో రజత్ వేలికి గాయం అయింది. అది నయం కావడానికి చాలా సమయం పట్టవచ్చు.
నివేదిక ప్రకారం.. రజత్ పాటిదార్ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని తెలుస్తోంది. ఇంగ్లాండ్ పర్యటన కోసం ఇండియా ఏ జట్టులో కూడా అవకాశం పొందలేడని సమాచారం. ఇప్పుడు రజత్ పాటిదార్ ఐపీఎల్లో ఆడటం కొనసాగిస్తాడు లేదా అనేది చూడాలి. భారత్, పాక్ దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ను వారం పాటు నిలిపివేయకపోతే రజత్ పాటిదార్ తర్వాత రెండు మ్యాచ్లలో ఆర్సీబీ తరఫున ఆడేవాడు కాదని భావిస్తున్నారు.

రజత్ పాటిదార్ తన వేలిని రక్షించుకోవడానిది స్ప్లింట్ ధరించమని వైద్యులు సూచించారు. రాబోయే రోజుల్లో రజత్ పాటిదార్ గాయం తగ్గిన తర్వాతే తిరిగి జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో రజత్ పాటిదార్ జట్టు ప్రాక్టీస్ సెషన్లలో బ్యాటింగ్ చేయకుండా నిషేధించబడ్డాడు.
ఇదిలా ఉండగా.. ఆ జట్టు స్టార్ బౌలర్ హేజిల్వుడ్ గాయం కారణంగా ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్లకు జట్టుకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు అతిపెద్ద బలం అని నిరూపించుకున్న జోష్ హేజిల్వుడ్ మిగిలిన మ్యాచ్లకు ఆడటం కష్టమే. హేజిల్వుడ్ భుజం గాయంతో బాధపడుతున్నాడు. రాబోయే మ్యాచ్లలో పాల్గొనడానికి భారత్కు వచ్చే సూచనలు కన్పించడం లేదు. ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో హేజిల్వుడ్ మూడో స్థానంలో ఉన్నాడు. హేజిల్వుడ్ 18 వికెట్లు పడగొట్టాడు. మే 3న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో మ్యాచ్కు దూరమయ్యాడు.
రెండో స్థానంలో ఆర్సీబీ
ఈ ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ మంచి దూకుడుగా రాణిస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 11 మ్యాచ్లు ఆడగా.. 8 మ్యాచ్ల్లో విజయం సాధించింది. 3 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. ప్రస్తుతం ఆర్సీబీ 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇక్కడి నుంచి ఒక విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుంది.