
ప్రపంచంలోనే క్యాష్ రిచ్ లీగ్ అయిన ఐపీఎల్ 16వ సీజన్కు రోజుల వ్యవధే ఉంది. ఈ క్రమంలో జట్లన్నీ కూడా ఇప్పటికే తమ ప్రాక్టీస్ సెషన్స్ మొదలు పెట్టాయి. ప్రధాన ఆటగాళ్లు అందరూ జట్టుతో చేరకపోయినా మిగతా ఆటగాళ్లంతా కలిసి ప్రాక్టీస్ మొదలు పెట్టారు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కూడా ఈ జాబితాలో చేరింది. విరాట్ కోహ్లీ మినహా దాదాపు ఆర్సీబీ జట్టు మొత్తం చిన్నస్వామి స్టేడియం చేరుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టింది.
హర్షల్ పటేల్, సూయష్ ప్రభుదేశాయి, కార్తిక్ తదితరులు మళ్లీ చిన్నస్వామి స్టేడియానికి చేరినందుకు సంతోషం వ్యక్తం చేశారు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా టీంతో కలిసి ప్రాక్టీస్ చేశాడు. 'మళ్లీ ఇలా హోం, ఎవే ఫార్మాట్లో ఆడే విషయంలో అందరూ చాలా ఎగ్జయిట్ అవుతున్నారు. అలాగే చిన్నస్వామిలో ఆర్సీబీకి ప్రేక్షకుల నుంచి దక్కే అభిమానాన్ని గుర్తుచేసుకుంటున్నారు' అని దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెసాన్ ఈ సందర్భంగా జట్టుతో మాట్లాడాడు.
'పది రోజులపాటు నెమ్మదిగా జట్టును నిర్మించడంలో ఇదే మొదటి రోజు. కాబట్టి ఈ రోజు బాగా కష్టపడటం మన టార్గెట్ కాదు. ఈ పది రోజుల ప్రాసెస్ను పద్ధతిగా మొదలు పెట్టాలి' అని హెసాన్ చెప్పాడు. అనంతరం ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కూడా జట్టుతో మాట్లాడాడు. జట్టులో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న పరిణితిని బంగర్ మెచ్చుకున్నాడు. 'ఈ ఏడాది అంతా మీ అభివృద్ధిని మేం గమనిస్తూనే ఉన్నాం. వేరే వేరే లీగుల్లో కొందరు సెంచరీలు బాదడం.. కొందరు పది వికెట్లు తీసుకోవడం.. దేశవాళీల్లో డబుల్ సెంచరీలు సాధించడం.. చూస్తే చాలా సంతోషంగా ఉంది' అని బంగర్ వెల్లడించాడు.
'మీలో కొంత మంది తమ దేశానికి ఆడాలనే చిరకాల కోరిక కూడా తీర్చుకున్నారు' అని బంగర్ కొనియాడాడు. ప్రస్తుతం జట్టు అంతా ప్రాక్టీస్ మొదలు పెట్టినా.. ఆర్సీబీ ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రాక్టీస్ మొదలు పెట్టేది మాత్రం ఆదివారం నుంచే. అదే రోజున క్రిస్ గేల్, ఏబీ డివిల్లీర్స్ వంటి వారిని ఆర్సీబీ హాల్ ఆఫ్ ఫేమ్లో చేరుస్తారు. అలాగే ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్ కూడా జరుగుతుంది. ఈ సమయంలోనే ఆర్సీబీ కొత్త జెర్సీ కూడా విడుదల చేస్తారని తెలుస్తోంది.