
బంగ్లా టూర్లో గాయం..
బంగ్లాతో రెండో వన్డేలో ఫీల్డింగ్ చేసే సమయంలో విల్ జాక్స్ గాయపడ్డాడు. ఈ గాయం కారణంగానే అతను ఐపీఎల్లో ఆడటం లేదని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం వరకు టీ20 లీగుల్లో అదర గొట్టిన విల్ జాక్స్.. ఆర్సీబీకి మంచి బలంగా మారతాడని అంతా అనుకున్నారు. మూడు సార్లు ఐపీఎల్ ఫైనల్ చేరినా ఒక్కసారి కూడా ట్రోఫీ నెగ్గని ఆర్సీబీ.. విల్ జాక్స్ చేరికతో బలంగా కనిపిస్తోందని, ఈసారి కచ్చితంగా ట్రోఫీ నెగ్గుతుందని ఫ్యాన్స్ అనుకున్నారు. ఈ ఆలోచనతోనే గతేడాది చివర్లో జరిగిన మినీ వేలంలో అతన్ని రూ.3.2 కోట్లు పెట్టి ఆర్సీబీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్కు దూరం..
ఇప్పటి వరకు విల్ జాక్స్ ఒక్కసారి కూడా ఐపీఎల్లో ఆడలేదు. అయితే వివిధ దేశాల్లో జరిగిన టీ20 లీగుల్లో ఈ ఏడాదే అరంగేట్రం చేసి అదరగొట్టాడు. ముఖ్యంగా సౌతాఫ్రికా టీ20 లీగ్లో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇప్పుడు ఇలా గాయపడి ఐపీఎల్కు దూరమవడం విల్ జాక్స్కు కూడా కష్టం తీసుకొచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు భారత్లో విల్ జాక్స్ ఎప్పుడూ ఆడలేదు. దీంతో ఐపీఎల్లో ఆడి భారత పరిస్థితులకు అలవాటు పడాలని, తద్వారా వన్డే వరల్డ్ కప్ ఆడే జట్టులో స్థానం సంపాదించాలని జాక్స్ అనుకున్నాడు.

జాక్స్ స్థానంలో కివీస్ ప్లేయర్?
ఇప్పుడు విల్ జాక్స్ గాయం కారణంగా జట్టుకు దూరం అవడంతో అతని స్థానంలో న్యూజిల్యాండ్ ఆల్రౌండర్ మైకేల్ బ్రేస్వెల్ను ఆర్సీబీ తీసుకోవాలని అనుకుంటోందట. ఇప్పటి వరకు బ్రేస్వెల్ కూడా ఐపీఎల్లో ఆడలేదు. కానీ ఇటీవల కివీస్ జట్టు భారత పర్యటనలో రాణించాడు. దీంతో అతను ఈ ఐపీఎల్లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది నాకౌట్స్ చేరిన ఆర్సీబీ రెండో క్వాలిఫైయర్లో రాజస్థాన్ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. ఈసారి మాత్రం ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్సీలో ఈ జట్టు ఎలాగైనా ట్రోఫీ నెగ్గాలని అనుకుంటోంది.


Click it and Unblock the Notifications












