ఇటీవలి కాలంలో పలువురు స్టార్ క్రికెటర్లు వర్క్ లోడ్ మేనేజ్మెంట్పై ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే అన్ని ఫార్మాట్ల క్రికెట్ ఆడటం కష్టమని అనుకుంటే.. ఏదో ఒక ఫార్మాట్కు వీడ్కోలు పలికేస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో శ్రీలంక స్పిన్ మెజీషియన్, ఆర్సీబీ స్టార్ వానిందు హసరంగా కూడా చేరాడు.
తను ఇకపై వైట్ బాల్ క్రికెట్పై పూర్తిగా ఫోకస్ పెడతానని చెప్పాడు. అందుకోసమే వానిందు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. టెస్టు క్రికెట్కు తను వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఉన్న బెస్ట్ స్పిన్నర్లలో వానిందు ఒకడు. అలాంటి వానిందు ముఖ్యంగా టీ20ల్లో ప్రపంచ మూడో నెంబర్ స్పిన్నర్గా ఉన్న సంగతి తెలిసిందే.

ఇదే విషయాన్ని వివరిస్తూ హసరంగ ఒక లేఖ కూడా రాసినట్లు తెలుస్తోంది. శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) చైర్మన్కు ఈ లేఖను హసరంగ పంపాడట. అతని రిటైర్మెంటును తాము అంగీకరించినట్లు కూడా క్రికెట్ బోర్డు వెల్లడించింది. అంటే హసరంగ టెస్టు కెరీర్ ముగిసినట్లే అన్నమాట. ఈ విషయంపై ఎస్ఎల్సీ సీఈవో యాష్లే డి సిల్వ తాజాగా ఒక ప్రకటన చేశారు.
'మేం హసరంగ రిటైర్మెంట్ నిర్ణయాన్ని స్వీకరిస్తున్నాం. భవిష్యత్తులో టీం వైట్బాల్ ప్రోగ్రాంలో కీలకమైన ఆటగాడిగా ఉంటాడని భావిస్తున్నాం' అని తెలిపారు. హసరంగ తన కెరీర్లో ఆడింది తక్కువ టెస్టులే అయినా.. పెద్దగా రాణించలేకపోయాడు. 2020లో సౌతాఫ్రికాపై టెస్టు అరంగేట్రం చేసిన అతను.. కెరీర్ మొత్తంలో నాలుగు మ్యాచులే ఆడాడు.
చివరగా 2021లో బంగ్లాదేశ్తో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలోనే అతను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఐపీఎల్లో హసరంగ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే వన్డే వరల్డ్ కప్లో శ్రీలంకకు హసరంగ చాలా కీలకం కానున్నాడు.