ఐపీఎల్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ గుడ్ బై చెప్పాడు. అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ అనంతరం డీకే ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఓ వైపు లీగ్కు వీడ్కోలు పలికిన బాధ, మరోవైపు టోర్నీ నుంచి ఆర్సీబీ నిష్క్రమించిన నిరాశతో కార్తీక్ కన్నీటిని ఆపుకుంటూ మైదానాన్ని వీడాడు.
దినేశ్ కార్తీక్కు ఆర్సీబీ ఆటగాళ్లకు గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తూ పెవిలియన్కు చేరారు. అయితే డీకే తన రిటైర్మెంట్పై అధికారికంగా ఎలా నోట్ను రిలీజ్ చేయలేదు. కానీ పరోక్షంగా క్రికెట్ ప్రపంచానికి తెలియజేశాడు. ఆర్సీబీకి కప్ను అందించి ఘనంగా లీగ్కు కార్తీక్ గుడ్బై చెప్పాలనుకున్నాడు. కానీ రాజస్థాన్ మ్యాచ్లో ఓటమి అనంతరం ఐపీఎల్-2024లో బెంగళూరు కథ ముగియడంతో అర్ధంతరంగా లీగ్ నుంచి తప్పుకున్నాడు.

ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఇప్పటివరకు లీగ్లో కొనసాగుతున్న అతికొద్ది మంది ఆటగాళ్లలో దినేశ్ కార్తీక్ ఒక్కరు. లీగ్లో తన ప్రయాణాన్ని కార్తీక్ ఢిల్లీ క్యాపిటల్స్ (ఢిల్లీ డేర్డెవిల్స్) నుంచి ప్రారంభించాడు. ఆర్సీబీతో పాటు ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ తరఫున కూడా డీకే ప్రాతినిథ్యం వహించాడు. అయితే ముంబై ఫ్రాంచైజీకి వెళ్లిన తర్వాత డీకేకు స్టార్డమ్ దక్కింది. 2013లో టైటిల్ గెలిచిన ముంబై జట్టులో డీకే సభ్యుడు. ఇక కేకేఆర్ తరఫున సారథి బాధ్యతలు కూడా నిర్వర్తించాడు.
ఐపీఎల్లో 257 మ్యాచ్లు ఆడిన డీకే 26.32 సగటు, 135 స్ట్రైక్రేటుతో 4842 పరుగులు చేశాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆర్సీబీ తరఫున ఫినిషర్ పాత్రలో కార్తీక్ సత్తాచాటాడు. 162 స్ట్రైక్రేటుతో 937 పరుగులు చేశాడు. 82 ఫోర్లు, 53 సిక్సర్లు సాధించాడు.