RCB Stampede: జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర ఆర్సీబీ విజయోత్సవంలో జరిగిన తొక్కిసలాట కేసును సీఐడీ పోలీసులు దర్యాప్తు చేశారు. సీఐడీ దర్యాప్తులో చాలా విషయాలు తెలిశాయి. సీఐడీ నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కోసమే తొందరపడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే ఈ ఘటనకు ప్రధాన కారణమని సీఐడీ దర్యాప్తులో తేలింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలిచిన మరుసటి రోజే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆర్సీబీ సీఈవో రాజేష్ మీనన్, ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలే కర్ణాటక రాష్ట్రం క్రికెట్ సంఘంపై ఒత్తిడి తెచ్చారు. ఆ ఇద్దరు వ్యక్తుల వల్లే తొందరపడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని సీఐడీ దర్యాప్తు తెలిసినట్లు సమాచారం.
ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమం ఆలస్యం చేస్తే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రాడని.. అందుకే జూన్ 4వ తేదీన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని విరాట్ కోహ్లీకి సన్నిహితుడైన నిఖిల్ సోసాలే కర్ణాటక రాష్ట్ర క్రికెట్ కమిటీపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఆర్సీబీ వేడుకను వాయిదా వేయాలని కర్ణాటక పోలీస్ డిపార్ట్మెంట్, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ కమిటీ సూచించాయి. కానీ కార్యక్రమాన్ని వాయిదా వేస్తే విరాట్ కోహ్లీ రాలేడని.. బ్రిటన్కు వెళ్లాలని నిఖిల్ సోసాలే ఒత్తిడి చేసినట్లు తెలిసింది. ఆర్సీబీ వేడుకకు వచ్చేవారికి స్టేడియంలోకి ఫ్రీ టికెట్లు ప్రకటించడం, టికెట్ల గందరగోళం గురించి సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. సీఐడీ బృందం సమాచారాన్ని సేకరించి నివేదికను సిద్ధం చేస్తోంది.

ఈ వేడుక కోసం ఉచిత టికెట్లను ప్రకటించడంతో అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారని సీఐడీ దర్యాప్తులో బయటపడింది. ఈ కార్యక్రమానికి కల్పించిన భద్రతా ఏర్పాట్లు సరిపోలేదని తెలిసింది. సరైన ప్రణాళిక లేకుండానే భద్రతను ఏర్పాటు చేసినట్లు సీఐడీ సమాచారాన్ని సేకరించింది. బెంగళూరు తొక్కిసలాట జరిగిన సమయంలో చిన్నస్వామి స్టేడియం గేట్ల వద్ద పోలీసులు ఎవరూ లేరు. ఆ విజయోత్సవ సమయంలో పోలీసుల సరైన రోల్ కాల్ కూడా నిర్వహించలేదని తేలింది. పోలీస్ శాఖ దృష్టి విధాన సౌధలో జరిగిన మరో కార్యక్రమంపై ఎక్కువగా ఉండడంతో చిన్నస్వామి స్టేడియం వద్ద జరగబోయే ఈ భారీ కార్యక్రమంపై సరైన శ్రద్ధ పెట్టలేదు. ఈ విషయాలన్నింటిని సీఐడీ తన దర్యాప్తు నివేదికలో పొందుపరుస్తున్నట్లు సమాచారం. త్వరలోనే సీఐడీ ఈ నివేదికను సమర్పించి తొక్కిసలాటకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.