
ఐపీఎల్లో ఇద్దరు ప్లేయర్లను ఒకేసారి ఆడిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి బాగా కలిసొస్తుందట. అయితే వాళ్లిద్దరూ ఒకేలాంటి ప్లేయర్లు కావడం గమనార్హం. వాళ్లెవరో కాదు.. ఆసీస్ స్టార్ గ్లెన్ మ్యాక్స్వెల్, కివీస్ ప్లేయర్ మైకేల్ బ్రేస్వెల్. వీళ్లిద్దరూ ప్రస్తుతం ఆర్సీబీ వద్దనే ఉన్నారు. ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ విల్ జాక్స్ గాయంతో ఐపీఎల్కు దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో రిప్లేస్మెంట్గా బ్రేస్వెల్ను తీసుకుంటున్నట్లు ఆర్సీబీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
దీనిపై న్యూజిల్యాండ్ మాజీ కోచ్ గ్లెన్ పాక్నల్ వివరణ ఇచ్చాడు. 'ఇద్దరూ ఒకేలాంటి ఆటగాళ్లు కావడంతో ఎందుకు ఆడించాలని అడగడం సమంజసమే. కానీ ఎందుకు ఆడకూడదు? అనేది నా ప్రశ్న. ఇద్దరూ మ్యాచ్ విన్నర్లు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లో రాణిస్తారు. టీ20ల్లో ఇలాంటి ఆటగాళ్లు ఎంత ఎక్కువ మంది జట్టులో ఉంటే అంత మంచిది. ఇద్దరిలో ఒకరు ఆడినా మ్యాచ్ గెలిచేస్తాం. వీళ్లిద్దరూ కలిసి ఆడటం వల్ల మిగతా జట్ల కన్నా ఆర్సీబీ ఒక మెట్టు పైన ఉంటుందని నా అభిప్రాయం' అని పాక్నల్ విశ్లేషించాడు.
ఐపీఎల్ మినీ వేలంలో బ్రేస్వెల్పై ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించకపోవడాన్ని కూడా తను అర్థం చేసుకున్నానని పాక్నల్ అన్నాడు. 'అంతర్జాతీయ క్రికెట్కు బ్రేస్వెల్ కొత్త. అందుకే అతన్ని ముందుగా ఎవరూ కొనుగోలు చేసుకోలేదు. కానీ అతను దేశవాళీల్లో మ్యాచ్ విన్నర్గా నిరూపించుకున్నాడు. గతేడాది కాలంలో న్యూజిల్యాండ్ తరఫున కూడా తన సత్తా చూపించడం మొదలు పెట్టాడు. భారత్పై అతను ఆడిన ఇన్నింగ్స్లో అది స్పష్టంగా కనిపించింది. ఆ మ్యాచ్లో మైదానం అన్ని వైపులా అతను భారీ షాట్లు బాదాడు' అని పాక్నల్ గుర్తుచేశాడు.
అదే సమయంలో మరో కివీస్ ప్లేయర్ను కూడా ఆర్సీబీ ఆడిస్తే బాగుంటుందని పాక్నల్ చెప్పుకొచ్చాడు. అతనెవరో కాదు.. పొట్టి ఫార్మాట్లో కివీస్కు అద్భుతమైన ఓపెనింగ్లు అందిస్తున్న ఫిన్ అలెన్. గతేడాది కూడా ఆర్సీబీతోనే ఉన్న అలెన్కు ఆడే ఛాన్స్ దక్కలేదు. 'ఆర్సీబీలో ఏదైనా మార్పు కావాలి. దీనికోసం ఫిన్ అలెన్కు ఛాన్స్ ఇస్తారని ఆశిస్తున్నా. వాళ్లు కొంచెం ధైర్యంగా ఆడాలి. అసలు అలెన్పై నమ్మకం లేకపోతే అతన్ని ఆర్సీబీ ఎందుకు కొనుగోలు చేసిందో నాకు అర్థం కావడం లేదు. కాబట్టి ఈ ఏడాది అతనికి అవకాశం ఇచ్చి, అలెన్ ఏం చేస్తాడో చూడాలి' అని పేర్కొన్నాడు.