IPL: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల తర్వాత తమ తొలి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. రజత్ పాటిదార్ కెప్టెన్సీలో ఆర్సీబీ జట్టు ఫైనల్లో పంజాబ్ కింగ్స్ను 6 పరుగుల తేడాతో ఓడించి టైటిల్ సాధించింది. అయితే ఐపీఎల్ విజేతగా నిలిచాక ఆర్సబీ చేపట్టిన విజయోత్సవ వేడుకలు విషాదంగా మారియి. బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ఆర్సీబీ అభిమానులు ప్రాణాలు కోల్పోగా.. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ క్రమంలోనే రాయల్ ఛాలెంజర్ బెంగళూరును విక్రయిస్తారనే ప్రచారం జరిగింది.
అయితే ఈ వార్తలను ఆర్సీబీ యాజమాన్యం అయినటువంటి డియాజియా కంపెనీ ఖండించింది. ఆర్సీబీ ఫ్రాంచైజీని విక్రయిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేసింది. ఆ వార్తలన్నీ ఊహాజనితాలేనని వెల్లడించింది. ఆర్సీబీ అమ్మకానికి చర్చలు కూడా జరగలేదని పేర్కొంది. ఇండియాలో ఆల్కహాల్, పొగాకు బ్రాండ్ల ప్రమోషన్పై నిషేధం ఉన్నా మా ఉత్పత్తులను ఇతర మార్గాల ద్వారా ప్రచారం చేసుకుంటామని.. దానికి, ఆర్సీబీ అమ్మకానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఈ మేరకు కంపెనీ అధికారికంగా ప్రకటనను విడుదల చేసింది. ఇలా ప్రస్తుతం జరుగుతున్న ప్రచారానికి తెరదించింది.

ఈ మేరకు కంపెనీ కార్యదర్శి మిట్టల్ సింఘ్వీ భారత స్టాక్ మార్కెట్ రెగ్యులేటింగ్ విభాగానికి లేఖ రాశారు. డియాజియో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయి ఉంది. అమ్మకం వార్తల అనంతరం స్టాక్ మార్కెట్ లో డియాజియో యాజమాన్యంలోని యునైటెడ్ స్పిరిట్స్ షేర్లు భారీగా పెరగగా.. అమ్మకం వార్తలపై బీఎస్ఈ డియాజియోకు మెయిల్ చేసింది. ఈక్రమంలో అవన్నీ వాస్తవాలు కాదని డియాజియో స్పష్టం చేసింది.
ఆర్సీబీ ఫ్రాంచైజీని భారత బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యా ప్రారంభించారు. ఆయన కంపెనీ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్.. 2012లో బ్యాంకులకు రుణం చెల్లించలేక మూతపడింది. దాంతో విజయ్ మాల్యా స్పిరిట్స్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడం ద్వారా.. డియాజియో ఆర్సీబీని స్వాధీనం చేసుకుంది.
ఆర్సీబీ ధర రూ. 16,834 కోట్లు
ఆర్సీబీ జట్టును పూర్తిగా లేదా ఫ్రాంచైజీలోని కొంత భాగాన్ని విక్రయించేందుకు డియాజియో ప్రయత్నిస్తున్నట్లు బ్లూమ్బెర్గ్ అనే అమెరికా మీడియా సంస్థ పేర్కొంది. ఇప్పటికే డయాజియో కంపెనీ ఆర్థిక సలహాదారులతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. జట్టు విలువ సుమారు 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.16,834 కోట్లు) ఉండొచ్చని అంచనా వేశారు. అయితే తాజాగా ఫ్రాంచైజీ విక్రయం వార్తలన్నీ అవాస్తవమని యాజమాన్యం తేల్చి చెప్పింది.