'ఈ సాలా కప్ నమదే' నిజం చేసుకోవడం కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో కీలక సమరానికి సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్లో బుధవారం రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. క్వాలిఫయిర్-2కు చేరుకోవాలంటే రేపటి మ్యాచ్లో తప్పక విజయం సాధించాలి. రెండు వారాల క్రితం పాయింట్ల పట్టికలో అట్టడుగన నిలిచిన ఆర్సీబీ, ఆ తర్వాత వరుసగా ఆరు విజయాలు సాధించి ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది.
అదే జోరులో రేపటి మ్యాచ్లోనూ రాజస్థాన్ రాయల్స్పై నెగ్గి క్వాలిఫయిర్-2కు చేరుకోవాలని ఆర్సీబీ కసిగా బరిలోకి దిగుతోంది. మరోవైపు రాజస్థాన్ గత నాలుగు మ్యాచ్ల్లోనూ ఓటమిచవిచూసింది. ఈ నెలలో జరిగిన అయిదు మ్యాచ్ల్లో ఒక్క విజయం కూడా సాధించలేకపోవడం రాజస్థాన్ను కలవరపెడుతోంది. అయితే ఆర్ఆర్ను తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి. రాజస్థాన్కు బ్యాటింగ్తో పాటు బౌలింగ్ లైనప్ ఉంది.

ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్రణాళికలతో రాజస్థాన్ రాయల్స్ను ఓడించాలని ఆర్సీబీ భావిస్తోంది. అహ్మదాబాద్ పిచ్కు తగ్గట్లుగా తుదిజట్టును కూర్పు చేయాలని యోచిస్తోంది. అహ్మదాబాద్లో గత ఆరు మ్యాచ్ల్లో బౌలర్లకు, బ్యాటర్లకు సమాన అవకాశాలు దక్కాయి. మూడు మ్యాచ్ల్లో 200+ స్కోరు నమోదయ్యాయి. అలాగే ఇక్కడే ఈ సీజన్ అత్యల్ప స్కోర్లు కూడా నమోదయ్యాయి.
కాగా, తుదిజట్టులో ఓ మార్పు చేయాలని ఆర్సీబీ భావిస్తోంది. మహిపాల్ లోమ్రర్ స్థానంలో అనుజ్ రావత్ను జట్టులోకి తీసుకురావాలని చూస్తోంది. లోమ్రర్ ఆల్రౌండర్ కాగా, అనుజ్ వికెట్ కీపర్ బ్యాటర్. అయితే అనుజ్ క్లీన్ హిట్టర్. లోమ్రర్తో పోలిస్తే దూకుడుగా పరుగులు సాధిస్తాడు. అహ్మదాబాద్ పిచ్ స్పిన్కు అనుకూలిస్తే మాక్స్వెల్తో 3-4 ఓవర్లు బౌలింగ్ చేయొచ్చని, అంతేగాక కర్ణ్ శర్మ, స్వప్నిల్ సింగ్ స్నిన్నర్లు ఉండటంతో లోమ్రర్ను పక్కనపెట్టాలని టీమ్ మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది. మరోవైపు అనుజ్ రాకతో ఆర్సీబీ బ్యాటింగ్కు మరింత బలోపేతంగా మారుతుందని ఆశిస్తుంది.
ఆర్సీబీ తుది జట్టు అంచనా:
డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, మాక్స్వెల్, రజత్ పటిదార్, కామెరూన్ గ్రీన్, అనుజ్ రావత్, దినేశ్ కార్తీక్, కర్ణ్ శర్మ, యశ్ దయాల్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్
ఇంపాక్ట్ ప్లేయర్: స్వప్నిల్ సింగ్.