ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆదివారం తలపడనుంది. ప్లేఆఫ్స్కు చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. తదుపరి దశకు చేరాలంటే తప్పక గెలవాల్సిన తరుణంలో ఆర్సీబీ వరుసగా నాలుగు విజయాలతో హోరెత్తించింది. అదే జోరులో ఢిల్లీపై గెలిచి పోటీలో నిలవాలని బెంగళూరు భావిస్తోంది.
మరోవైపు తమ సారథి రిషభ్ పంత్ లేకుండా ఢిల్లీ క్యాపిటల్స్ రేపటి పోరులో బరిలోకి దిగనుంది. స్లోఓవర్ రేట్ కారణంగా పంత్ ఓ మ్యాచ్కు నిషేధానికి గురైన విషయం తెలిసిందే. అయితే పంత్ లేకపోయినప్పటికీ ఢిల్లీని తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి. జేక్ ఫ్రేజర్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్లతో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది. అంతేగాక గత నాలుగు మ్యాచ్ల్లో మూడింట్లో గెలిచి ఢిల్లీ ఆత్మవిశ్వాసంతో ఉంది.

ఈ నేపథ్యంలో ఢిల్లీని కట్టడిచేయడానికి ప్రత్యేక వ్యూహాలు రచించాలని ఆర్సీబీ భావిస్తోంది. భీకర హిట్టర్ మాక్స్వెల్ను తిరిగి జట్టులోకి తీసుకురావాలని భావిస్తోంది. మాక్స్వెల్ ఫామ్లో లేకపోయినప్పటికీ అతడి విధ్వంసం ఇన్నింగ్స్ స్వరూపాన్ని మార్చగలదు. అంతేగాక కుల్దీప్ యాదవ్ స్పిన్లో కౌంటర్ ఎటాక్ చేయాలంటే మాక్సీ అవసరమని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.
అయితే విల్ జాక్స్, కామెరూన్ గ్రీన్, ఫెర్గూసన్ జట్టులో కుదురుకున్నారు. ఈ ముగ్గురిలో ఎవరినీ తప్పించలేని పరిస్థితి. గత మ్యాచ్లో గ్రీన్, ఫెర్గూసన్ సత్తాచాటారు కూడా. కానీ మాక్సీ రాక కోసం ఫెర్గూసన్ను జట్టు నుంచి తప్పించాలని జట్టు యాజమాన్యం యోచిస్తోంది. అలాగే రజత్ పటిదార్ను ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ ప్లేయర్గా జట్టులో కొనసాగించనుంది. ఫెర్గూసన్ స్థానంలో విజయ్కుమార్ వైశాక్ పేస్ బాధ్యతలు అందుకునే అవకాశం ఉంది.
కాగా, ఇప్పటివరకు ఢిల్లీ-ఆర్సీబీ 30 సార్లు తలపడ్డాయి. 18 మ్యాచ్ల్లో బెంగళూరు, 11 మ్యాచ్ల్లో ఢిల్లీ గెలిచింది. ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు. ఈ సీజన్లో ఇరు జట్లు తలపడటం ఇదే మొదటిసారి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు (అంచనా)
విరాట్ కోహ్లి, డుప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, గ్లెన్ మాక్స్వెల్, కామెరూన్ గ్రీన్, దినేశ్ కార్తీక్, కర్ణ్ శర్మ, స్వప్నిల్ సింగ్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, విజయ్కుమార్ వైశాక్
ఇంపాక్ట్ ప్లేయర్: రజత్ పటిదార్.