ఐపీఎల్లో అత్యంత ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శనివారం తలపడనుంది. ప్లేఆఫ్స్కు చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. తదుపరి దశకు చేరాలంటే తప్పక గెలవాల్సిన తరుణంలో ఆర్సీబీ వరుసగా అయిదు విజయాలతో హోరెత్తించింది. అదే జోరులో సీఎస్కేపై గెలిచి పోటీలో నిలవాలని బెంగళూరు భావిస్తోంది.
అయితే చెన్నైపై బెంగళూరు కేవలం గెలిస్తే సరిపోదు. ప్రత్యర్థి జట్టు కంటే నెట్రన్రేటును మెరుగుపర్చుకోవాలి. దాని కోసం సీఎస్కేపై 18 పరుగుల తేడాతో లేదా 11 బంతులు మిగిలుండగానే నెగ్గాలి. ఉదాహరణకు ఆర్సీబీ 200 స్కోరు సాధిస్తే, చెన్నైని 182 పరుగులకే కట్టడి చేయాలి. ఒకవేళ చెన్నై తొలుత బ్యాటింగ్ చేస్తే 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని బెంగళూరు ఛేదించాలి.

మరోవైపు సీఎస్కేకు నెట్ రన్రేటుతో సంబంధం లేదు. గెలిస్తే ప్లేఆఫ్స్కు చేరుకుంటుంది. ప్రస్తుతం సీఎస్కే (14 పాయింట్లు, +0.528 ) నాలుగో స్థానంలో, ఆర్సీబీ (12 పాయింట్లు, +0.387) ఆరో స్థానంలో ఉన్నాయి. అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే చెన్నైకే కలిసొస్తుంది. ఆ జట్టు తదుపరి దశకు చేరుకుంటుంది.
పిచ్ ఎలా ఉంది?
చిన్నస్వామి స్టేడియం బ్యాటర్లకు స్వర్గధామమే. కానీ గత మ్యాచ్లో బౌలర్లకు పిచ్ కాస్త కలిసొచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 188 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ బౌలర్లు కాపాడుకున్నారు. అయితే సీఎస్కేతో మ్యాచ్ జరిగే రోజు స్టేడియంపై మేఘావృతమై ఉంటే బౌలర్లు పైచేయి సాధిస్తారు.
అయితే ఈ మ్యాచ్కు ముందు ఆర్సీబీకి ఎదురుదెబ్బ తగిలింది. గత విజయాల్లో కీలకపాత్ర పోషించిన ఆల్రౌండర్ విల్ జాక్స్ తిరిగి స్వదేశానికి వెళ్లాడు. ఫామ్లో ఉన్న అతను దూరమవ్వడం జట్టుకు తీరని లోటే. అయితే అతని స్థానంలో గ్లెన్ మాక్స్వెల్ను తిరిగి జట్టులోకి తీసుకురావాలని బెంగళూరు టీమ్ మేనేజ్మెంట్ భావిస్తుంది. ఈ సీజన్లో అట్టర్ ఫ్లాప్ అయిన మాక్సీ రేపటి మ్యాచ్లో విజృంభించి, జట్టును గెలిపించాలని ఆశిస్తోంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు (అంచనా)
విరాట్ కోహ్లి, డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటిదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరూన్ గ్రీన్, మహిపాల్ లోమ్రర్, దినేశ్ కార్తీక్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, ఫెర్గూసన్
ఇంపాక్ట్ ప్లేయర్: స్వప్నిల్ సింగ్.