క్రికెట్లో అవకాశాల కోసం వయస్సు లేదా నివాస ధ్రువీకరణ పత్రాలను తారుమారు చేయడం కొత్తేమీ కాదు. తాజాగా పుదుచ్చేరి జట్టు తరఫున ఆడుతున్న ఎడమ చేతి వాటం స్పిన్నర్ సాత్విక్ దేశ్వాల్పై ఇటువంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే ఆర్సీబీ జట్టుకు ఈ వార్త కలవరాన్ని కలిగిస్తోంది. ఇటీవలే వేలంలో ఆర్సీబీ కొనుగోలు చేసిన యువ స్పిన్నర్ సాత్విక్ దేశ్వాల్పై డాక్యుమెంట్ల ఫోర్జరీ ఆరోపణలు వచ్చాయి. పుదుచ్చేరి జట్టు తరపున ఆడేందుకు ఆయన తప్పుడు పత్రాలను సమర్పించారని బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ (ACU)కు ఫిర్యాదు అందింది.
ఆర్సీబీ కొనుగోలు చేసిన ఆటగాడేనా?
ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో 18 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సాత్విక్ దేశ్వాల్ను ఆర్సీబీ రూ. 30 లక్షల బేస్ ధరకు దక్కించుకుంది. గతంలో ఆయన అదే జట్టుకు నెట్ బౌలర్గా కూడా పనిచేశారు. అయితే పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్ నుంచి ఆడుతున్న ఈ సాత్విక్ దేశ్వాల్పైనే ఇప్పుడు ఫిర్యాదు దాఖలైంది.

ప్రధాన ఆరోపణలు ఏమిటి?
'పుదుచ్చేరి నేటివ్ క్రికెట్ ప్లేయర్ అసోసియేషన్' బీసీసీఐకి పంపిన ఈమెయిల్లో పేర్కొన్న అంశాలు ఇవే:
పుదుచ్చేరి జట్టుకు ఆడాలంటే కనీసం ఏడాది పాటు అక్కడే నివసించి ఉండాలి. కానీ సాత్విక్ ఆ నిబంధనను ఉల్లంఘించాడని ఆరోపణ. సాత్విక్ ఆగస్టు 10, 2025 వరకు హర్యానా క్రికెట్ అసోసియేషన్ లీగ్లో ఆడాడని, అలాంటప్పుడు ఆయన పుదుచ్చేరి నివాసిగా ఎలా గుర్తింపు పొందుతారని అసోసియేషన్ ప్రశ్నించింది. ఫిర్యాదు చేసి నెల రోజులు గడిచినా బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే స్పందించకపోతే మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్తామని హెచ్చరించింది.
"అవన్నీ అబద్ధాలు" - పుదుచ్చేరి అసోసియేషన్ స్పందన
ఈ ఆరోపణలపై క్రికెట్ అసోసియేషన్ పుదుచ్చేరి (CAP) మాజీ అధ్యక్షుడు పి. దామోదరన్ ఘాటుగా స్పందించారు. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. "సాత్విక్పై వచ్చినవన్నీ తప్పుడు ఆరోపణలు. కావాలనే బురద జల్లుతున్నారు. తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిపై రూ. 50 కోట్ల పరువు నష్టం దావా వేస్తాం. మా న్యాయవాదులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు." అని ఆయన స్పష్టం చేశారు.
ఆర్సీబీ భవితవ్యంపై ప్రభావం?
సాత్విక్ దేశ్వాల్ 18 ఏళ్ల యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ఐపీఎల్ 2026 వేలంలో ఆర్సీబీ అతడిని రూ.30 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది. ఒకవేళ బీసీసీఐ విచారణలో సాత్విక్ దేశ్వాల్ దోషిగా తేలితే, ఆయనపై నిషేధం పడే అవకాశం ఉంది. అదే జరిగితే ఐపీఎల్ 2026లో ఆయన ఆర్సీబీ తరపున ఆడే అవకాశం కోల్పోతారు. ప్రస్తుతం ఈ యంగ్ స్పిన్నర్ చుట్టూ తిరుగుతున్న వివాదం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీసీసీఐ విచారణలో సాత్విక్ నిర్దోషిగా తేలుతారా లేదా చర్యలకు గురవుతారా అనేది వేచి చూడాలి. ఈ ఉదంతం భారత దేశవాళీ క్రికెట్లో నివాస అర్హత నిబంధనలపై మరోసారి చర్చకు దారితీసింది.