ఎవరు ఈ కుర్రాడు..?
కోన శ్రీకర్ భరత్... ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ పేరు నానుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో చివరి బంతిని సిక్స్గా మలిచి అద్భుత విజయాన్ని బెంగళూరు జట్టుకు అందించిన తెలుగు కుర్రాడు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో 1993 అక్టోబర్ 3వ తేదీన భరత్ జన్మించాడు. చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే భరత్కు అమితమైన ప్రేమ. దీంతో బ్యాట్ చేత పట్టాడు. అదే సమయంలో వికెట్ కీపింగ్పై కూడా దృష్టి పెట్టి అందులో కూడా సక్సెస్ అయ్యాడు. స్టంప్స్ వెనకాల ఉండి బెయిల్స్ను గిరాటేయడంలో మనోడు ధోనీని తలపిస్తాడు. ఇక దేశీయ క్రికెట్లో భరత్ ఆంధ్రా క్రికెట్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2015 ఫిబ్రవరిలో ఓ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి సెలక్టర్ల దృష్టిని ఆకట్టుకున్నాడు. రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా హిస్టరీ క్రియేట్ చేశాడు. అదే ఏడాది ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఢిల్లీ డేర్ డెవిల్స్ అతన్ని రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది.

ఆర్సీబీ తరపున భరత్...
ఇక జూలై 2018లో దులీప్ ట్రోఫీకి ఇండియా బ్లూ జట్టుకు సెలెక్ట్ అయ్యాడు. 2019లో బంగ్లాదేశ్తో జరిగిన రెండవ టెస్టు మ్యాచ్లో వృద్ధిమాన్ సాహాతో పాటు కోన శ్రీకర్ భరత్ కూడా ఎంపికయ్యాడు. జనవరి 2020లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో రిషబ్ పంత్ గాయపడటంతో భరత్కు అవకాశం దక్కింది. ఇక 2021లో ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రకటించిన ఐదు స్టాండ్బై ప్లేయర్లలో భరత్కు కూడా చోటు దక్కింది. ఫిబ్రవరి 2021లో ఐపీఎల్కు జరిగిన వేలంపాటలో భరత్ను బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ దక్కించుకున్నారు.
భరత్ గణాంకాలు
ఇప్పటి వరకు 69 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన శ్రీకర్ భరత్ 37.58 సగటుతో 3909 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు ఉండగా.. 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధికంగా 308 పరుగులు చేశాడు.ఇక వికెట్ల వెనక ఉంటూ 232 క్యాచ్లు పట్టి 27 స్టంపింగ్లు చేశాడు. ముందుగా భరత్ వికెట్ కీపర్ కాదు. విశాఖలో ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో భరత్ అక్కడికి వెళ్లి వారితో కలిసి ఆడేవాడు. ఫీల్డింగ్ అద్భుతంగా చేసేవాడు. ఇవన్నీ గమనించిన అతని కోచ్ కృష్ణారావు భరత్ను కీపింగ్ చేయాల్సిందిగా ప్రోత్సహించాడు. తొలుత కాస్త ఇబ్బంది పడినప్పటికీ సుదీర్ఘ సాధనతో ఏకంగా ఆంధ్రా క్రికెట్ జట్టుకు కీపర్గా ఎంపికయ్యాడు. ఇక అతని వికెట్ కీపింగ్ ఎంత చురుగ్గా చేస్తాడో వీడియోలో చూడొచ్చు.

భరత్ పై మాజీ క్రికెటర్ల ప్రశంసలు
ఇక కోన భరత్ బెంగళూరు జట్టును విజయతీరాలకు నడిపించిన తీరుపై పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు. ఈ కుర్రాడు భారత్కు ఆశాకిరణం అంటు ఆకాశానికెత్తేస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు. ఇర్ఫాన్ పఠాన్, ఆర్పీ సింగ్, ప్రగ్ఞాన్ ఓజా ఇలా చాలామంది ప్రశంసించారు. ఇక ఈ 28 ఏళ్ల కుర్రాడు టీమిండియాకు ఎంపిక అవడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాదు జట్టు 11 మందిలో ఒకడిగా ఉంటాడని క్రికెట్ పండితులు సైతం చెబుతున్నారు. అందుకే అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడమంటే ఇదేనేమో అనిపిస్తుంది. భరత్ సరిగ్గా అదే చేసి చూపించాడు. శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 52 బంతులను ఎదుర్కొని 78 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇందులో 4 భారీ సిక్స్లు ఉండగా 3 ఫోర్లు ఉన్నాయి. చివరి బంతిని సిక్స్గా మలిచి బెంగళూరును విజయతీరాలకు చేర్చిన తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డ్లోకి వచ్చి భరత్ను కౌగలించుకున్నాడు. ఇక భరత్ వ్యక్తిగత విషయానికొస్తే తాను ప్రేమించిన అమ్మాయి అంజలీ నెడునూరిని గతేడాది పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈ స్వీట్ ఇన్నింగ్స్తో భరత్ టీమిండియాలో సుస్థిర స్థానం సంపాదించుకుని తెలుగు రాష్ట్రాలు గర్వపడేలా చేస్తాడని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications
