IPL 2026: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2025లో ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. ఆర్సీబీ జట్టు ఫైనల్లో పంజాబ్ కింగ్స్ను ఓడించి టైటిల్ను తమ ఖాతాలో వేసుకుంది. ఫైనల్ అయిన మరుసటి రోజు బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన విక్టరీ పరేడ్లో తొక్కిసలాట చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దీని కారణంగా 11 మంది ప్రాణాలు విడిచారు. ఈ తొక్కిసలాట ఘటన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో ఎటువంటి మ్యాచ్లు జరగలేదు. స్టేడియం మ్యాచ్లను నిర్వహించడానికి ఇంకా గ్రీన్సిగ్నల్ పొందలేదు. 2026 టీ20 ప్రపంచ కప్ వేదికల జాబితాలో కూడా దీనిని ఎంపిక చేయలేదు.
ఆర్సీబీ కొత్త 'హోమ్ గ్రౌండ్' కోసం వేట
నివేదికల ప్రకారం.. ఆర్సీబీ తన 2026 ఐపీఎల్ హోమ్ మ్యాచ్లను చిన్నస్వామి స్టేడియంలో ఆడకపోవచ్చు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన 2026 ఐపీఎల్ హోమ్ మ్యాచ్లన్నింటినీ పుణేలో ఆడే అవకాశం ఉంది. ఈ మార్పుకు కారణం బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఫలితంగా చిన్నస్వామి స్టేడియంపై ఉన్న నిషేధం.

మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (MCA) కార్యదర్శి కమలేష్ పిసాల్ మాట్లాడుతూ.. "ఈ ఏర్పాటు (పుణేలో ఆర్సీబీ మ్యాచ్లను నిర్వహించడం)పై చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇంకా ఖరారు కాలేదు. కర్ణాటకలో ఆర్సీబీకి సమస్య ఉంది. ఎందుకంటే అక్కడ తొక్కిసలాట జరిగింది. కాబట్టి వారు వేదికల కోసం చూస్తున్నారు. మేము మా స్టేడియాన్ని వారికి ఆఫర్ చేశాం. ప్రారంభ చర్చలు జరిగాయి. కొన్ని సాంకేతిక అంశాలు ఇంకా పరిష్కరించబడాలి. అంతా సవ్యంగా జరిగితే పుణే మ్యాచ్లను నిర్వహిస్తుంది." అని ఆయన వెల్లడించారు.
అంతా అనుకున్నట్టు జరిగితే పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (MCA) స్టేడియం 2026 ఐపీఎల్ సీజన్ కోసం ఆర్సీబీ కొత్త హోమ్ గ్రౌండ్గా మారే అవకాశం ఉంది.