ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సత్తాచాటింది. డబుల్ హ్యాట్రిక్ ఓటముల తర్వాత ఎట్టకేలకు తిరిగి గెలుపు బాట పట్టింది. ఉప్పల్ వేదికగా గురువారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో ఆర్సీబీ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 206 పరుగులు చేసింది. రజత్ పటిదార్ (50; 20 బంతుల్లో, 2x4, 5x6) మెరుపు అర్ధశతకం సాధించాడు. కామెరూన్ గ్రీన్ (37*; 20 బంతుల్లో, 5x4) ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లి (51; 43 బంతుల్లో, 4x4, 1x6) అర్ధశతకం అందుకున్నప్పటికీ నిదానంగా బ్యాటింగ్ చేశాడు. 118 స్ట్రైక్రేటుతో పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ మూడు (3/30) వికెట్లు తీశాడు.

అనంతరం ఛేదనలో సన్రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 171 పరుగులు చేసింది. షాబాజ్ అహ్మద్ (40*; 37 బంతుల్లో, 1x4, 1x6) టాప్ స్కోరర్. అభిషేక్ శర్మ (31; 13 బంతుల్లో, 3x4, 2x6), ప్యాట్ కమిన్స్ (31; 15 బంతుల్లో, 1x4, 3x6) పోరాడారు. ఆర్సీబీ బౌలర్లలో కర్ణ్ శర్మ (2/29), కామెరూన్ గ్రీన్ (2/12) రెండు వికెట్లతో సత్తాచాటారు.
అయితే SRH మ్యాచ్తో ఆర్సీబీ అరుదైన ఘనత అందుకుంది. ఐపీఎల్ చరిత్రలో 250 మ్యాచ్లు ఆడిన రెండో ఫ్రాంచైజీగా నిలిచింది. బెంగళూరు జట్టు కంటే ముందు ముంబై ఇండియన్స్ మాత్రమే 250 మార్క్ను అందుకుంది. కాగా, ఈ స్పెషల్ మ్యాచ్లో ఛాలెంజర్స్ స్పెషల్ విన్ సాధించింది. మరోవైపు విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు నమోదైంది.
ఐపీఎల్లో ఓపెనర్గా నాలుగు వేల పరుగులు సాధించిన నాలుగో ప్లేయర్గా కోహ్లి చరిత్రకెక్కాడు. ఓపెనర్గా అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో శిఖర్ ధావన్ (6362 పరుగులు), డేవిడ్ వార్నర్ (5909 పరుగులు), క్రిస్ గేల్ (4480 పరుగులు), విరాట్ కోహ్లి (4041 పరుగులు) టాప్-4లో ఉన్నారు.