
పైథాన్ స్క్రిప్ట్ సాయంతో
పలు జట్లలో కరోనా కేసులు రావడంతో ఈ నెల 4వ తేదీన ఐపీఎల్ 2021 బీసీసీఐ నిరవధిక వాయిదా వేసింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఐపీఎల్ 14వ సీజన్ ముగిసేవరకు ఆదిష్ జైన్ అనే అభిమాని ఉండలేకపోయాడు. విజేతను ఎలాగైనా ప్రకటించాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం పైథాన్ స్క్రిప్ట్ సాయం తీసుకున్నాడు. బాల్-బై-బాల్ ప్రాతిపదికన అనుకరణను అమలు చేసి కోడ్ రాశాడు. వివిధ రకాల పిచ్లు, మ్యాచ్-అప్లు మరియు ఇటీవలి జట్లు, ఆటగాళ్ల ఫామ్, రికార్డులను పరిగణనలోకి తీసుకున్నాడు.

ఫైనల్లో ఢిల్లీపై విజయం
ఆదిష్ జైన్ తీసుకున్న రూల్స్ ప్రకారం.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ప్లే ఆఫ్స్ చేరాయి. లీగ్ దశలో ఆర్సీబీ 11, ఢిల్లీ 10, చెన్నై 8, పంజాబ్ 7 మ్యాచుల్లో విజయాలు సాధించాయి. క్వాలిఫైర్-1లో బెంగళూరు, ఢిల్లీ తలపడగా.. బెంగళూరు విజయాన్ని అందుకుని నేరుగా ఫైనల్ చేరుకుంది. ఎలిమినేటర్ మ్యాచులో చెన్నై, పంజాబ్ జట్లు ఢీ కొన్నాయి. ఇందులో పంజాబ్ గెలిచింది. ఇక క్వాలిఫైర్-1లో ఢిల్లీ, పంజాబ్ తలపడగా.. ఢిల్లీ ఫైనల్ చేరింది. ఫైనల్లో ఢిల్లీపై గెలిచిన ఆర్సీబీ మొదటిసారి టైటిల్ గెలుచుకుంది.

ఐదేళ్ల డేటాతో:
'గత డేటా, ప్రిడిక్టివ్ ఎనాలిసిస్ మరియు రాండమైజేషన్ టెక్నిక్లను ఉపయోగించి ఐపీఎల్ మొత్తం సీజన్పై (ప్లేఆఫ్లను మినహాయించి) పైథాన్ ప్రోగ్రామ్ రాశాను. స్కోర్ కార్డ్లలో కొన్ని ఆసక్తికరమైన దృశ్యాలు ఉన్నాయి. బెంగళూరు అభిమానులు నా ప్రోగ్రామ్ ఇష్టపడతారనుకుంటున్నా. బ్యాట్స్మన్ మరియు బౌలర్ల గత ఐదేళ్ల డేటాను సేకరించాను. ఒక బ్యాట్స్మన్ ఎలాంటి పరుగులు చేశాడు (సింగిల్స్, డబుల్స్, ఫోర్లు లేదా సిక్సర్లు), బౌలర్లు ఎలా పరుగులు (పవర్ప్లే, మిడిల్, డెత్ ఓవర్లు, వికెట్లు) ఇచ్చారు, ఓ ఆటగాడు పట్టిన క్యాచులు కూడా పరిగణలోకి తీసుకున్నా' అని జైన్ విస్డెన్.కామ్కు చెప్పాడు.

ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు:
ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచీ ఆర్సీబీ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, డేల్ స్టెయిన్ లాంటి దిగ్గజ ఆటగాళ్లున్నా.. ఆ జట్టు ఛాంపియన్గా అవతరించలేదు. ప్రతీసారి కప్పు మనదే అంటూ రావడం, ఒట్టి చేతులతో వెనుతిరగడం పరిపాటిగా మారింది. మూడుసార్లు ఫైనల్కు చేరినా కప్పు సాధించలేకపోయింది. 2016లో మినహా ఏ ఏడాది కూడా కనీస ప్రదర్శన కూడా కనబర్చలేదు. అయితే ఐపీఎల్ 2021లో మాత్రం వరుస విజయాలతో దూసుకుపోయింది. ఇప్పటివరకు 7 మ్యాచులు ఆడిన కోహ్లీసేన ఐదు విజయాలు అందుకుని 10 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది. కానీ కరోనా ఊహించని రీతిలో ఆర్సీబీ ఆశలపై నీళ్లుచల్లింది.


Click it and Unblock the Notifications












