
మహిళల ప్రీమియర్ లీగ్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు అదరగొట్టారు. యూపీ వారియర్జ్తో జరుగుతున్న మ్యాచ్లో ఆరంభం నుంచే రాణించిన ఆర్సీబీ బౌలర్లు.. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ వచ్చారు. దీంతో యూపీ జట్టు ఏ దశలోనూ భారీ స్కోరు చేసేలా కనిపించలేదు. తొలి బంతి నుంచే చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ఆర్సీబీ.. యూపీ జట్టును చాలా తక్కువ స్కోరుకే పరిమితం చేసింది.
ఆర్సీబీ బౌలర్లు ధాటికి బెంబేలెత్తిన యూపీ బ్యాటర్లు ఏమాత్రం ప్రతిఘటించలేకపోయారు. ఈ క్రమంలోనే యూపీ ఓపెనర్ దేవిక వైద్య (0) డకౌట్ అయింది. ఆ జట్టు కెప్టెన్ అలీసా హేలీ (1) కూడా దారుణంగా విఫలమైంది. ఇలాంటి సమయంలో కిరణ్ నవగిరే (22) నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసింది. తహీలియా మెక్గ్రాత్ (2) విఫలమవగా.. గ్రేస్ హారిస్ (46) రాణించింది. సిమ్రాన్ షేక్ (2) కూడా ఫెయిలవగా.. దీప్తి శర్మ (22), సోఫీ ఎక్సెల్టోన్ (12), శ్వేత సెహ్రావట్ (6), అంజలి శ్రావణి (8), రాజేశ్వరీ గైక్వాడ్ (12) పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో ఆ జట్టు కేవలం 135 పరుగులకే ఆలౌట్ అయింది.

యూపీ బ్యాటర్లను వణికించిన బెంగళూరు బౌలర్లలో.. ఆల్రౌండర్ ఎలీస్ పెర్రీ మూడు వికెట్లతో చెలరేగింది. సోఫీ డివైన్, శోభనా ఆశ ఇద్దరూ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. మేగన్ షూట్, శ్రేయాంక పాటిల్ కూడా చెరో వికెట్ తీసుకున్నారు. దీంతో యూపీ వారియర్జ్ జట్టు 19.3 ఓవర్లలో 135 పరుగులకే ఆలౌట్ అయింది. ఆర్సీబీ బ్యాటర్లు కనుక ఈ మ్యాచ్లో రాణిస్తే డబ్ల్యూపీఎల్లో ఆ జట్టు తొలి విజయం సాధించే అవకాశం ఉంది. మరి ఆర్సీబీ బ్యాటర్లు ఏమాత్రం రాణిస్తారో చూడాలి.