
మహిళల ప్రీమియర్ లీగ్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరోసారి తడబడింది. యూపీ వారియర్జ్తో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే ఆ నిర్ణయం బెడిసికొట్టింది. ఓపెనర్గా వచ్చిన ఆమె కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరింది. యూపీ బౌలర్లు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బెంగళూరు బ్యాటర్లు వేగంగా పరుగులు చేయలేకపోయారు.
అయితే సోఫీ డివైన్ (36), ఎలీస్ పెర్రీ (52) ఇద్దరూ రాణించారు. ఆ తర్వాత వచ్చిన కణికా అహూజా (8), హెదర్ నైట్ (2) ఈ మ్యాచ్లో పూర్తిగా విఫలమయ్యారు. శ్రేయాంక పాటిల్ (15), ఎరిన్ బర్న్స్ (12) క్రీజులో కుదురుకున్నట్లే కనిపించినా ఆ వెంటనే అవుటయ్యారు. ఆ తర్వాత వచ్చిన రిచా ఘోష్ (1) దారుణంగా విఫలమైంది. చివర్లో రేణుకా సింగ్ (3), కోమల్ జంజాద్ (6 నాటౌట్), సహానా పవార్ (0) ఏమీ చెయ్యలేకపోయారు. దీంతో బెంగళూరు జట్టు ఏ దశలోనూ భారీ స్కోరు చేసేలా కనిపించలేదు.
యూపీ వారియర్జ్ బౌలర్లలో దీప్తి శర్మ, సోఫీ ఎక్సెల్టోన్ చెరో మూడు వికెట్లతో సత్తా చాటగా.. రాజేశ్వరి గైక్వాడ్ ఒక వికెట్ తీసుకుంది. ఆర్సీబీలో హెదర్ నైట్, రిచా ఘోష్ ఇద్దరూ కూడా కీలకమైన సమయంలో రనౌట్ అయ్యారు. చివరి ఓవర్ వేసిన ఎక్సెల్టోన్ రెండు వికెట్లు తీయడంతో ఆర్సీబీ 138 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. డబ్ల్యూపీఎల్లో ఆర్సీబీ బ్యాటింగ్ ఇలా ఘోరంగా విఫలమవడం ఇదే తొలిసారి కాదు. ఈ జట్టు ఆడిన మొదటి మ్యాచ్ నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. బౌలర్లు కూడా పెద్దగా రాణించకపోవడంతో ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆర్సీబీ ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదన్న సంగతి తెలిసిందే.