IPL 2025: ఐపీఎల్ 2025లో 24వ మ్యాచ్ బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బౌలింగ్ ఎంచుకుని.. ఆ తర్వాత 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ఓడిపోయిన అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ తమ జట్టు ఎందుకు ఓడిపోయిందో చెప్పాడు.
మ్యాచ్ ఓడిపోయిన తర్వాత రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. "పిచ్ అందరూ అనుకున్నట్లుగా లేదని నేను అనుకుంటున్నాను. అది మంచి బ్యాటింగ్ పిచ్ అవుతుందని మేము అనుకున్నాం కానీ సరిగ్గా బ్యాటింగ్ చేయడంలో విఫలమయ్యాం. మా బ్యాటర్లు అంత నమ్మకంగా లేరని నేను అనుకుంటున్నాను. అందరూ సరైన ఉద్దేశంతో ఆడతున్నారు. కానీ వెంటవెంటనే వికెట్లు పడిపోవడం మమ్మల్ని దెబ్బతీసింది. 80 పరుగులకు ఒక వికెట్ పడిపోయి ఉండి.. 90 పరుగులే 4 వికెట్లు పడిపోవడం మంచిది కాదు. ఆర్సీబీకి మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది కానీ మేము పరిస్థితికి తగ్గట్లుగా సరిగ్గా ఆడాలి. మ్యాచ్ లో కొన్ని సానుకూల విషయాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు టిమ్ డేవిడ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. పవర్ ప్లేలో మా బౌలింగ్ బాగుంది. మైదానాల్లో మా రికార్డు గురించి మేము పెద్దగా ఆలోచించడం లేదు. కేవలం మనం మంచి క్రికెట్ ఆడాలి." అని రజత్ పాటిదార్ అన్నాడు.

మ్యాచ్ పరిస్థితి ఇలా..
ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ తన జట్టులో అజేయంగా 37 పరుగులు చేశాడు. దీనితో పాటు ఫిల్ సాల్ట్ 37, రజత్ పాటిదార్ 25 , విరాట్ కోహ్లీ 22 పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 17.5 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 164 పరుగుల లక్ష్యాన్ని చేరుకుంది. కేఎల్ రాహుల్ (93*), ట్రిస్టన్ స్టబ్స్(38*) అజేయంగా నిలిచి ఢిల్లీ జట్టును విజయపథంలో నడిపించారు.