మరికాసేపట్లో అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెజంర్స్ బెంగళూరు - రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ ప్రారంభం కానుండగా షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి భద్రత ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ప్రాక్టీస్ సెషన్ కూడా రద్దు చేసింది. మరోవైపు అహ్మదాబాద్ విమనాశ్రయంలో నలుగురు ఉగ్రవాద అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు.
అనంతరం వాళ్ల రహస్య నివాస ప్రదేశాన్ని శోధించగా ఆయుధాలు, అనుమానస్పద వీడియోలు పోలీసులకు లభించినట్లు సమాచారం. అహ్మదాబాద్లో మంగళవారం కీలక పరిణామాలు చోటు చేసుకోగా ఈ విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ప్రాక్టీస్ సెషన్తో పాటు మీడియా సమావేశాన్ని కూడా రద్దు చేసింది.

ఎలిమినేటర్ మ్యాచ్ జరగనున్న నరేంద్ర మోడీ స్టేడియం వద్ద పోలీసులు భద్రతను పెంచారు. అంతేగాక ఆర్సీబీ ఆటగాళ్లు ఉంటున్న హొటల్కు సెక్యూరిటీని రెట్టింపు చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్తో పాటు రాజస్థాన్ రాయల్స్ జట్టును కూడా పోలీసులు అప్రమత్తం చేశారు. దీంతో ఆర్ఆర్ కూడా ప్రెస్ మీట్ను క్యాన్సిల్ చేసింది. అయితే పోలీసుల రక్షణలో రాజస్థాన్ టీమ్ సాధన కొనసాగించింది.
విరాట్ కోహ్లి జాతీయ సంపదగా ఆర్సీబీ ఫ్రాంచైజీ భావించిందని, అందుకే రిస్క్ తీసుకోవాలనుకోలేదని స్టానిక పోలీసుధికారి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ సెషన్తో పాటు మీడియా సమావేశాన్ని రద్దు చేసుకుందని అన్నారు. కాగా, ఇవాళ జరగనున్న మ్యాచ్ యథావిధిగా కొనసాగుతుంది. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఎలిమినేటర్ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు క్వాలిఫయిర్-2కు అర్హత సాధించింది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో క్వాలిఫయిర్-2లో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్కు చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా, ఈ పోరులో గెలిచిన జట్టు ఫైనల్లో కేకేఆర్తో పోటీపడుతుంది. చెపాక్ వేదికగానే టైటిల్ పోరు జరగనుంది.