
బెంగళూరు: ప్రతిష్టాత్మక ప్రయోగం చంద్రయాన్-2 ల్యాండర్ విక్రమ్ శిథిలాలను మంగళవారం అమెరికాకు చెందిన స్పేస్ ఏజెన్సీ నాసా గుర్తించిన విషయం తెలిసిందే. చెన్నైకి చెందిన ఇంజినీరు షణ్ముగ సుబ్రమణ్యం నాసాకు సాయం చేశారు. ఈ సందర్భంగా నాసాకు ఐపీఎల్ ప్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభినందనలు తెలిపింది. అంతేకాదు ఓ విన్నపం కూడా చేసింది.
'నాసా టీమ్ విక్రమ్ ల్యాండర్ ఆచూకీని కనిపెట్టిందా. మాకు కూడా మీ అవసరం ఉంది. డివిలియర్స్, కోహ్లీలు కొట్టే సిక్సర్లను కూడా కనిపెట్టడానికి సాయం చేయండి' అంటూ ఆర్సీబీ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. క్రికెట్ అభిమానులు తమదైన స్టయిల్లో కెమెంట్లు పెడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
'ఏబీడీ, కోహ్లీ కొట్టిన బంతుల్ని గుర్తించడం కన్నా.. మ్యాచులు ఎలా గెలవాలో కనుగొనేందుకు నాసా సాయం చేస్తే బాగుంటుంది' అని ఓ అభిమాని ఫైర్ అయ్యాడు. 'ఓ మంచి బౌలర్ను కనుక్కోండి', 'ముందుగా తొలి ట్రోఫీ అందుకొండి', 'నేను ఆర్సీబీ పాయింట్ల పట్టికలో కిందే ఉండటం కనుగొంటా', 'వెంటనే ఆర్సీబీ ట్విటర్ నిర్వాహకుడిని తొలగించండి', 'ఫైనల్లో ఓడిపోయినప్పుడూ కూడా ఇంత ఘోరంగా అనిపించలేదు' అని కామెంట్లు చేస్తున్నారు.
ఐపీఎల్ మొదలయి సుమారు 12 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటివరకూ ఆర్సీబీ ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా సాధించలేదు. భారత్ జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఆర్సీబీ ఇన్నాళ్లు ట్రోఫీ గెలకపోవడం సగటు క్రికెట్ ప్రేమికుడిని నిరాశకు గురి చేస్తుంది. ప్రతీ ఏడాది ఫ్యాన్స్ నిరాశతో వెనుదిరుగుతున్నా.. ఆర్సీబీపై మాత్రం నమ్మకాన్ని వదల్లేదు. అయితే ఈసారి కచ్చితంగా టైటిల్ గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఈనెల 19వ తేదీన ఐపీఎల్ వేలం జరుగనున్న నేపథ్యంలో ఇప్పటికే లీగ్ హడావుడి మొదలయింది.