రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ల ధాటికి గుజరాత్ టైటాన్స్ పూర్తి ఓవర్లు కూడా ఆడలేకపోయింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా శనివారం ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. షారుక్ ఖాన్ (37; 24 బంతుల్లో, 5x4, 1x6) టాప్ స్కోరర్. యశ్ దయాల్ (2/21), విజయ్ కుమార్ వైశాక్ (2/23), మహ్మద్ సిరాజ్ (2/29) తలో రెండు వికెట్లతో సత్తాచాటారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్కు పేలవారంభం లభించింది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే గుజరాత్ను సిరాజ్ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (1; 7 బంతుల్లో), శుభ్మన్ గిల్ (2; 7 బంతుల్లో) వరుస ఓవర్ల ఔట్ చేశాడు. సిరాజ్కు తోడుగా ఆర్సీబీ ఇతర బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ పవర్ప్లేలో మూడు వికెట్లు కోల్పోయి 23 పరుగులే చేసింది. ఐపీఎల్ చరిత్రలో గుజరాత్కు ఇదే అత్యల్ప పవర్ప్లే స్కోరు కావడం గమనార్హం.

ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన షారుక్ ఖాన్తో కలిసి డేవిడ్ మిల్లర్ (30; 20 బంతుల్లో, 3x4, 2x6) ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 37 బంతుల్లో 67 పరుగులు జోడించారు. అయితే ప్రమాదకరంగా మారుతున్న మిల్లర్ను కర్ణ్ శర్మ 12వ ఓవర్లో ఔట్ చేశాడు. అంతకుముందు ఓవర్లోనే మిల్లర్ ఔట్ కావాల్సింది. కానీ కర్ణ్ శర్మ ఈజీ క్యాచ్ను మిస్ చేశాడు. ఆ తర్వాత అతనే ఔట్ చేసి లెక్క సరిచేశాడు.
కాసేపటికే విరాట్ కోహ్లి మెరుపు త్రోకి షారుక్ ఖాన్ రనౌటయ్యాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ 87 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. అయితే కర్ణ్ శర్మను లక్ష్యంగా చేసుకుని రాహుల్ తెవాతియా (35; 21 బంతుల్లో, 5x4, 2x6) చెలరేగాడు. 16 ఓవర్లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్ బాది 19 పరుగులు పిండుకున్నారు. మరో ఎండ్లో ఉన్న రషీద్ ఖాన్ (18; 14 బంతుల్లో, 2x4, 1x6) కూడా కాస్త దూకుడుగా ఆడటంతో స్కోరుబోర్డు ఊపందుకుంది.
కానీ గుజరాత్ జోరుకు ఆర్సీబీ బౌలర్లు మరోసారి బ్రేక్ వేశారు. క్రమం తప్పకుండా వికెట్లు సాధించి స్కోరును కట్టడిచేశారు. సాయి సుదర్శన్ (6; 14 బంతుల్లో) స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన విజయ్ శంకర్ (10; 7 బంతుల్లో, 2x4) కూడా నిరాశపరిచాడు. యశ్ దయాల్, సిరాజ్, విజయ్కుమార్ చెరో రెండు, కర్ణ్ శర్మ ఒక్క వికెట్ తీశారు.