ఐపీఎల్లో అత్యధిక స్కోరు సాధించిన టీమ్ రికార్డును కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అరుదైన ఘనత సాధించింది. తమ అభిమానులు గర్వంగా చెప్పుకునే ఓ క్రేజీ రికార్డును ఆర్సీబీ నెలకొల్పంది. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టు ఇప్పటివరకు ఈ ఘనతను సాధించలేకపోవడం గమనార్హం.
ఇంతకీ ఆర్సీబీ ఏం సాధించిందంటే.. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు తొమ్మిది వికెట్ల తేడాతో ఘనంగా నెగ్గిన విషయం తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 200 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (84*; 49 బంతుల్లో, 8x4, 4x6), షారుక్ ఖాన్ (58; 30 బంతుల్లో, 3x4, 5x6) అర్ధశతకాలు సాధించారు.

అనంతరం ఛేదనలో బెంగళూరు ఒక్క వికెట్ కోల్పోయి 16 ఓవర్లలో విజయం సాధించింది. విల్ జాక్స్ (100*, 41 బంతుల్లో, 5x4, 10x6) అజేయ మెరుపు శతకం సాధించాడు. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన జాక్స్ 41 బంతుల్లో సెంచరీ బాదేశాడు. అతడికి తోడుగా విరాట్ కోహ్లి (70*; 44 బంతుల్లో, 6x4, 3x6) విధ్వంసం సృష్టించాడు.
అయితే ఛేదనలో 24 బంతులు మిగిల్చిన ఆర్సీబీ అరుదైన రికార్డు సాధించింది. 200+ స్కోరు ఛేజింగ్లో అత్యధిక బంతులు మిగిల్చి విజయం సాధించిన జట్టుగా బెంగళూరు చరిత్ర సృష్టించింది. అంతకముందు ఈ రికార్డు ముంబై ఇండియన్స్ (21 బంతుల్లో) పేరిట ఉండేది. మరోవైపు నిన్న సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ చెత్త రికార్డు నెలకొల్పింది.
మొదట చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (98; 54 బంతుల్లో, 10x4, 3x6) తృటిలో శతకాన్ని కోల్పోయాడు. అనంతరం ఛేదనలో సన్రైజర్స్ 18.5 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలి 78 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కాగా, ఐపీఎల్లో పరుగుల పరంగా ఎస్ఆర్హెచ్కు ఇదే అతి పెద్ద ఓటమి. అంతకుముందు 2013లో సీఎస్కే చేతిలో 77 పరుగుల ఓటమి అతిపెద్ద పరాజయంగా ఉండేది.