మహిళల ప్రీమియర్ లీగ్(WPL)-2025 ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - ముంబయి ఇండియన్స్ ఉమెన్స్ జట్టుకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు స్టార్ ప్లేయర్లు గాయాల వల్ల ఈ సీజన్ కు దూరం కాగా.. ఇప్పుడు మరో ఇద్దరు ప్లేయర్లు కూడా దూరమయ్యారు.
ఫిబ్రవరి 14 తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. గుజరాత్ జెయింట్స్తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు 33 ఏళ్ల స్టార్ లెగ్ స్పిన్నర్ ఆశా శోభన గాయం వల్ల తప్పుకుంది. ఈ విషయాన్ని తెలిపిన మేనేజ్ మెంట్ ఆమె స్థానాన్ని భారత వికెట్ కీపర్ నుఝత్ పర్వీన్ తో భర్తీ చేయనున్నట్లు పేర్కొంది.

అదే చివరిసారిగా..
మహిళల టీ20 వరల్డ్ కప్-2024లో చివరగా ఆడిన ఆశా శోభన.. అప్పుడు గ్రూప్ దశలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో గాయపడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కోలుకోలేదు. ఈ నేపథ్యంలోనే డబ్ల్యూపీఎల్ తాజా సీజన్ మొత్తానికి ఆమె దూరమవ్వాల్సి వచ్చింది.
గత సీజన్ లో కీలకంగా..
డబ్ల్యూపీఎల్ 2024 సీజన్ లో ఆర్సీబీ ఛాంపియన్గా నిలవడంలో ఆశా శోభన కీలక పాత్ర పోషించింది. మొత్తంగా పన్నెండు వికెట్లు తీసింది. ఇప్పటికే ఆర్సీబీలోని సోఫీ మోలినెక్స్, కేట్ క్రాస్ గాయాల కారణంగా ఈ సీజన్ కు దూరమయ్యారు. సోఫీ డివైన్ వ్యక్తిగత కారణాల వల్ల టోర్నీ నుంచి తప్పుకుంది. దీంతో మోలినెక్స్ స్థానంలో చార్లీ డీన్(ఇంగ్లాండ్), డివైన్, క్రాస్ స్థానంలో హీథర్ గ్రహమ్, కిమ్ గర్త్ వచ్చారు.
ముంబయి ఇండియన్స్కు కూడా షాక్..
ముంబయి ఇండియన్స్కు కూడా షాక్ తగిలింది. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ పూజా వస్త్రాకర్ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడం వల్ల ఈ సీజన్ మొత్తానికి దూరమైంది. ఆమె స్థానంలో పరుణిక సిసోడియా జట్టులోకి ఎంట్రీ ఇచ్చింది.