లాహోర్: పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ మంత్రి షూజా ఖాన్ జాదా భారత్ పైన తీవ్ర ఆరోపణలు చేశారు. జింబాబ్వే జట్టును పాకిస్తాన్లో పర్యటించకుండా అడ్డుకునేందుకు భారత్కు చెందిన నిఘా సంస్థ 'రా' ప్రయత్నాలు చేసిందని ఆరోపించాడు.
లాహోర్లోని పంజాబ్ అసెంబ్లీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ పర్యటనకు బయలుదేరిన జింబాబ్వే జట్టు దుబాయ్లో అడుగు పెట్టే సమయంలో ఆ జట్టు మేనేజర్కు 'రా' ఓ సందేశం పంపించిందని, ఆటగాళ్లు లాహోర్ వెళ్తే వారిలో ఏ ఒక్కరు తిరిగి ప్రాణాలతో తిరిగి వెళ్లలేరని చెప్పిందని ఆరోపించాడు.
జింబాబ్వే జట్టు మేనేజర్ ఆ సందేశాన్ని తమకు ఫార్వార్డ్ చేయడంతో విషయం తెలిసిందని చెప్పాడు. దానిని పరిశీలించగా 'రా' అధికారి నుండి వచ్చినట్టు తెలిసిందని ఆరోపించాడు. జింబాబ్వే పర్యటనపై వారు ఎత్తుగడ వేస్తే తాము తిప్పికొట్టామన్నాడు.