టీమిండియా హెడ్ కోచ్గా రవిశాస్త్రి శకం ముగిసే సమయంలో బీసీసీఐని ఎన్నో కాంట్రవర్సీలు చుట్టుముట్టాయి. అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కోహ్లీని వన్డే కెప్టెన్గా తొలగించడంలో గంగూలీ కీలక పాత్ర పోషించినట్లు వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత టెస్టు కెప్టెన్గా కూడా కోహ్లీ తప్పుకున్నాడు. ఈ క్రమంలో కేవలం తన బ్యాటింగ్ మీదనే ఫోకస్ పెట్టి, మళ్లీ తన పూర్వపు ఫామ్ అందుకునేందుకు కోహ్లీ ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి సమయంలో అప్పటి టీమిండియా హెడ్ కోచ్ పెద్ద బాంబు పేల్చాడు. తను కోచ్గా ఉన్న సమయంలో టీం సెలెక్షన్ మీటింగుల్లో చాలా మంది పాల్గొనే వారని, అంతమంది ఈ మీటింగుల్లో పాల్గొనడం బీసీసీఐ రూల్స్కు విరుద్ధమని స్పష్టం చేశాడు.

'నాకు ఈ మీటింగ్స్కు సంబంధించి అనుభవం ఏమీ లేదు. నేను జట్టుతో ఉన్న ఏడు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా సెలెక్షన్ మీటింగ్కు వెళ్లలేదు. నన్ను ఎవరూ ఆహ్వానించలేదు కూడా. ఈ లాంగ్ రన్లో జట్టులోని కుర్రాళ్లతో చాలా సమయం గడుపుతాం. కాబట్టి సెలెక్టర్లు ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఓటింగ్ అవకాశం ఇవ్వకపోయినా.. సెలెక్టర్ ధోరణి తెలుసుకోవడానికైనా ఈ మీటింగుల్లో పాల్గొనాలి' అని వివరించాడు.
ప్రస్తుతం సెలెక్టర్ల మీటింగులో కోచ్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ ఇద్దరూ పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై రవిశాస్త్రి ఏం మాట్లాడలేదు. సెలెక్టర్ల ఆలోచనా విధానం తెలిస్తే జట్టుకు ఏం కావాలో చేసే అవకాశం ఉంటుందని, కానీ తనకు ఎప్పుడూ ఈ మీటింగ్లో పాల్గొనే అవకాశం రాలేదని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు ఈ మీటింగ్ ఎలా మొదలవుతుందో కూడా తనకు ఏమాత్రం ఐడియా లేదన్నాడు.

'ఈ సెలెక్షన్ మీటింగులు ఎలా మొదలవుతాయో? ఎలా ముగుస్తాయో నాకు ఏమాత్రం నాలెడ్జ్ లేదు. నాకు తెలిసిన వివరాల ప్రకారం, గడిచిన 3-4 ఏళ్లలో చాలా మంది ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. రూల్స్ ప్రకారం ఈ మీటింగ్స్లో వాళ్లు పాల్గొనకూడదు. ఇది బీసీసీఐ రాజ్యాంగానికి విరుద్ధం. కానీ వాళ్లంతా ఈ మీటింగ్స్లో పాల్గొన్నారని నాకు సమాచారం వచ్చింది' అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఈ విషయం విన్న ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.